తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెండ్ లోకేష్.. కొత్త సవాళ్లు రెడీ
Publish Date:Apr 15, 2026
Advertisement
తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక కీలక అధ్యాయం మొదలైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్కు పార్టీలో ప్రమోషన్ కల్పిస్తూ మరింత ఉన్నతమైన బాధ్యతలను కట్టబెట్టారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు. పార్టీలో లోకేష్ పోషిస్తున్న చురుకైన పాత్రను గుర్తిస్తూ, ఆయన్ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మార్పు ద్వారా పార్టీలో తదుపరి తరం నాయకత్వానికి బాటలు పరిచినట్లైంది. ముఖ్యంగా యువతలో పార్టీకి ఉన్న పట్టును పెంచడంతో పాటు, క్షేత్రస్థాయిలో కేడర్ను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయం ఉద్దేశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి గత దశాబ్ద కాలంగా లోకేష్ చేస్తున్న పని ఇదే. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన విరామమెరుగని కృషి చేస్తున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించడంలో ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర కీలక పాత్ర పోషించిందన్నది నిస్సందేహం. దాదాపు 000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి, లక్షలాది మంది ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న లోకేష్పై కార్యకర్తల్లో అమితమైన నమ్మకం ఏర్పడింది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పార్టీలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా అధికారిక హోదా లభించడంతో పార్టీ బలోపేతం విషయంలో మరింత క్రియాశీలంగా వ్యవహరిస్తారు. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం కేడర్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అటువంటి క్లిష్ట సమయంలో పార్టీని నడిపించడంలో లోకేష్ చూపిన తెగువకు కేడర్ నీరాజనాలు పలుకుతోంది. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే సమయంలో లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు నియమించడం అంటే.. మరిన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి లోకేష్ ను సిద్ధం చేయడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ జాతీయ రాజకీయాలలో తనదైన భూమిక పోషిస్తున్న లోకేష్ ఇప్పుడు అదనంగా రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలలో కూడా క్రియాశీలంగా వ్యవహరించడమే కాకుండా, పార్టీని ఏకతాటిపై నడిపించాల్సిన బాధ్యత కూడా చేపట్టాల్సి ఉంటుంది. ఇక అనుభవం, యువత కలబోతగా చంద్రబాబు కమిటీలను నియమించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పార్టీ పట్టును మరింత బలోపేతం లక్ష్యం అని చాటారు. అలాగే.. ఎంపీ బైరెడ్డి శబరి, రాజేష్ కిలారు వంటి వారికి కూడా ప్రధాన కార్యదర్శి హోదా ఇచ్చారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును కొనసాగిస్తూనే, నందమూరి బాలకృష్ణను పొలిట్బ్యూరోలో సభ్యుడిగా కొనసాగించడం ద్వారా సమతూకం పాటించారు. మొత్తంగా పార్టీలో తాజాగా జరిగిన మార్పులు కేవలం పదవుల పంపకం మాత్రమే కాకుండా, పార్టీ భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బలమైన సామాజిక సమీకరణాలు, యువతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా టీడీపీ తన పునాదులను మరింత పటిష్టం చేసుకుందంటున్నారు.
http://www.teluguone.com/news/content/telugu-desam-working-president-lokesh-45-217437.html





