కర్నూలులో తెలుగుదేశం కార్యకర్తపై దాడి.. నలుగురు వైసీపీయులు అరెస్టు
Publish Date:Jun 19, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కర్నూలో ఉద్రిక్తతకు , హింసకు దారితీసింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో జరిగే తప్పులను ఎత్తిచూపినందుకు తెలుగుదేశం కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, తప్పులను వెలికితీసి ప్రశ్నించినందుకే ఈ దాడి జరిగిందన్న ఆరోపణలు రాజకీయవేడిని రగిలచ్చాయి. కర్నూలులో తెలుగుదేశం కార్యకర్త తైజుం బాషాపై హత్యాయత్నం జరిగింది. బాధితుడు తైజుం బాషా తన ఇంటి సమీపంలోని ఒక కిరాణా దుకాణానికి వెళ్లి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకుని తిరిగి వస్తుండగా, పథకం ప్రకారం అతడిపై వైసీపీయులు దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో బాషాపై జరిగిన ఈ దాడిలో బాషా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడి జరిగిందని వారు తమ ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అధికారికంగా జరుగుతున్న కొన్ని అక్రమాలను, తప్పుడు ఓట్ల నమోదును తైజుం బాషా నిలదీసినందుకే ఈ దాడి జరిగిందని వారా ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల విచారణలో ఈ దాడికి పాల్పడినట్లు నిర్ధారణ అయిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులను జలీల్, జునైద్, ఫైజల్, ఆరిఫ్లు నలుగురూ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రధాన అనుచరులని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం పోలీసులు వారిని పీఎస్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు కాలినడకన రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారైనా ఊపేక్షించేది లేదనే హెచ్చరికను పంపేందుకే పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది.
http://www.teluguone.com/news/content/telugu-desam-activist-attacked-in-kurnool-four-36-223570.html





