రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Publish Date:May 6, 2026
Advertisement
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇకపై కేవలం బియ్యమే కాకుండా, పౌష్టికాహార విలువలు ఎక్కువగా ఉండే జొన్నలను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, బలవర్ధకమైన ఆహారాన్ని పేదలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ అంశంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్క్ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను బహిరంగ మార్కెట్లో వేలం వేయకుండా, నేరుగా పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు అందించాలని అధికారులను కోరారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదని ఆయన స్పష్టం చేశారు. కేవలం సామాన్య ప్రజలకే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో కూడా విద్యార్థుల మెనూలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనంలో జొన్నలను అంతర్భాగం చేయడం ద్వారా వారిలో పోషకాహార లోపాన్ని నివారించవచ్చని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. మరోవైపు రైతుల సంక్షేమం దృష్ట్యా కూడా ఈ నిర్ణయం ఎంతో కీలకమైనది. ప్రస్తుతం మార్కెట్లో జొన్నలు, మొక్కజొన్న ధరలు మద్దతు ధర కంటే తక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోయినా, రాష్ట్ర సొంత నిధులతోనే యాసంగి పంటను సేకరించాలని ప్రభుత్వం నిశ్చయించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 278 కొనుగోలు కేంద్రాల ద్వారా మొక్కజొన్న సేకరణ ముమ్మరంగా సాగుతోందని వెల్లడించారు. యాసంగిలో సుమారు 3.68 లక్షల ఎకరాల్లో జొన్న సాగు జరిగిందని, రైతుల వద్ద నుండి ప్రతి గింజను కొనుగోలు చేసి పీడీఎస్ ద్వారా పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం వల్ల అటు రైతులకు ఆర్థిక భద్రత చేకూరడంతో పాటు, ఇటు సామాన్య ప్రజలకు ఆరోగ్యకరమైన చిరుధాన్యాలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఈ పంపిణీ ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది. సామాజిక వర్గాల్లో ఈ నిర్ణయం పట్ల సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.
http://www.teluguone.com/news/content/telangana-ration-shop-news-36-219068.html





