బీజేపీకి అగ్నిపరీక్ష... సత్తా చాటకపోతే అంతే సంగతులు...
Publish Date:Dec 30, 2019
Advertisement
మున్సిపల్ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించనివిధంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో... టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంటూ బీజేపీ చెప్పుకున్నా... మిగతా ఏ ఎన్నికల్లోనూ ఆ స్థాయి ఫలితాలు సాధించలేకపోతోంది. ఇక, ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నికలో అయితే కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే మున్సిపోల్స్ లో బీజేపీకి మంచి ఫలితాలు సాధించి పెడతాయని భావిస్తున్నారు. ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పీఆర్ పై నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నా... హిందూవర్గాల్లో చాలా సానుకూలత ఉందని, అదే తమకు కలిసొస్తుందని లెక్కలేసుకుంటున్నారు. మున్సిపోల్స్ లో ఒంటరి పోరుకు దిగుతోన్న బీజేపీ... గతంలో ప్రభావం చూపించిన మున్సిపాలిటీలపై దృష్టిపెట్టింది. మోస్తరు ఓట్లు సాధించిన మున్సిపాలిటీల్లో నేరుగా ప్రజలను కలవాలని నిర్ణయించింది. అలాగే, మున్సిపాలిటీల వారీగా మేనిఫెస్టోలను రూపొందిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి అంతోఇంతో పట్టుండటంతో ఓటర్లను ప్రభావితం చేసే అన్ని అంశాలపై దృష్టిపెడుతున్నారు. అలాగే, ప్రజల్లో పేరున్న చోటామోటా నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఒక క్లస్టర్ గా తీసుకొని నలుగురిని ఇన్ ఛార్జులుగా నియమిస్తున్నారు. మొత్తానికి మున్సిపోల్స్ ను బీజేపీ నేతలు సీరియస్ గానే తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి... 2023లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనన్న సంకేతాలను ప్రజల్లోకి పంపాలని భావిస్తున్నారు. అయితే, ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పీఆర్ ఇష్యూస్.... తెలంగాణ మున్సిపోల్స్ లో బీజేపీకి బలంగా మారతాయో లేక డిపాజిట్లు దక్కకుండా చేస్తాయో చూడాలి.
http://www.teluguone.com/news/content/telangana-bjp-party-big-hopes-on-municipal-elections-25-92688.html