ఇంగ్లాండ్ తో రెండో టి20.. టీమ్ ఇండియా ఓటమి.!
Publish Date:Jul 4, 2026
Advertisement
ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ టో టీమ్ ఇండియా పరాజయాన్ని మూటకట్టుకుంది. . హై-స్కోరింగ్ థ్రిల్లర్గా సాగిన ఈ పోరులో ఇంగ్లండ్ ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్, ఇండియా టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణమైన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించి ఈ సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఆరంభంలోనే టీమిండియా స్పీడ్స్టర్ అర్ష్దీప్ సింగ్ గట్టి షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ప్రమాదకర ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, కెప్టెన్ జోస్ బట్లర్ లను డకౌట్ గా పెవిలియన్ పంపాడు. కేవలం 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ తీవ్ర కష్టాల్లో పడిన వేళ, కెప్టెన్ హ్యారీ బ్రూక్ కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బ్రూక్ అవుటైన తర్వాత యువ సంచలనం జాకబ్ బెథెల్ ఇన్నింగ్స్ బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. టామ్ బాంటన్ తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దిన బెథెల్, ఆ తర్వాత టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోతూ కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బెథెల్ పవర్ హిట్టింగ్ ధాటికి ఇంగ్లండ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే, అంటే 19 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 191 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించింది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 37 పరుగులతో బాధ్యతాయుతంగా రాణించాడు. ఇక ఆఖర్లో యువ ఆటగాడు తిలక్ వర్మ కేవలం 11 బంతుల్లోనే 24 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కరన్ 3 వికెట్లతో రాణించాడు. ఇంతటి భారీ స్కోరు చేసినప్పటికీ బౌలింగ్ వైఫల్యం, ముఖ్యంగా జాకబ్ బెథెల్ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా భారత్కు ఓటమి తప్పలేదు. ఇరు జట్ల మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి మూడో టీ20 మ్యాచ్ జులై 7న జరగనుంది. ఇక పోతే.. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల 99 రోజుల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజులు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. తన తొలి మ్యాచ్లోనే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వికెట్ కీపర్ తల మీదుగా కొట్టిన అద్భుతమైన సిక్సర్తో సహా 10 బంతుల్లో 14 పరుగులు చేసి స్టంపౌట్ అయ్యాడు. Jacob Bethell power hitting, Ind vs Eng, Vaibhav Suryavamshi, Entry
http://www.teluguone.com/news/content/team-india-defeated-in-2nd-t20-36-225085.html





