రేవంత్ ‘రెడ్డి’ లేకుండా రాష్ట్ర కాంగ్రెస్ చింతన్ శిబిర్... అనుమానాలు అనేకం ..
Publish Date:Jun 1, 2022
Advertisement
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఇంచుమించుగా సంవత్సరం కావస్తోంది. అప్పటి నుంచి ఆయన పార్టీలో అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.అయినా ఇప్పటికీ రాష్ట్ర పార్టీలో ఒక వర్గం ఆయన నాయకతాన్ని వ్యతిరేకిస్తూనే వుంది. నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టడం, పార్టీలోని సీనియర్లకు రుచించడం లేదు. ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఆయన నాయకత్వాన్ని ప్రశ్నిస్తూనే వస్తోంది. అయినా, ఎప్పటి కప్పుడు కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుని ఇరు వర్గాల మధ్య సంధి కుదురుస్తోంది. అయితే, కేంద్ర నాయకత్వం జోక్యంతో తాత్కాలికంగా వేడి చల్లారినా, అగ్గి మాత్రం అలా రాజుకుంటూనే వుంది. అప్పుడప్పుడు బయట పడుతోంది. భగ్గుమంటోంది. ఈ నేపధ్యంలో, రేవంత్ రెడ్డి దేశంలో లేని సమయంలో, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అధ్వర్యంలో ఈరోజు (జూన్ 1) నుంచి రెండు రోజులు హైదరాబద్’లో రాష్ట్ర కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహిస్తోంది. నిజమే ఇటీవల రాజస్థాన్’లోని ఉదయ్పూర్’ లో నిర్వహించిన చింతన శిబిర్ /మేధో మథన సదస్సులో ఆమోదించిన తీర్మనాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసమే చింతన్ శిబిర్’ పరిమితమైతే అందులో తప్పు పట్టవలసింది లేదు. అది, మంచి ఆలోచనే..కానీ, పీసీసీ అధ్యక్షుడు లేకుండా చింతన్ శిబిర్ నిర్వహించడం ఏమిటి? పీసీసీ అధ్యక్షుడు లేకుండా పీసీసీ కార్యాచారణపై చర్చలేంటి? టీపీసీసీ చీఫ్ ప్రమేయం లేకుండా ఎన్నికల కార్యాచరణ ఎలా ఖారారు చేస్తారు? అని పలువురు నాయకులు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే. పీసీసీ అధ్యక్షునికి, సీఎల్పీ నేతకు అనేక విషయాల్లో విబేధాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. దళిత బంధు వ్యవహారంలో, భట్టి విక్రమార్క, పార్టీ స్టాండ్’కు వ్యతిరకంగా, ప్రభుత్వ అనుకూల ధోరణి తీసుకోవడం వివాదమైంది. అదలా ఉంటే, తాజాగా కొద్దిరోజుల క్రితం, రేవంత్ రెడ్డి చేసిన, ‘రెడ్డి’ ఆధిపత్య అనుకూల వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం లేపాయి. పార్టీలోని రెడ్డి నాయకులు సహా పలువురు రేవంత్ వ్యాఖ్యలతో విభేదించారు. రేవంత్ రెడ్డి నాయకత్వాని సమర్ధిస్తున్న మధు యాష్కీ అయితే ఏకంగా, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ మౌలిక సూత్రాలకు రేవంత్ వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయంటూ ఘాటుగా స్పందించారు. ఇలాంటి పరిస్థితిలో, అది కూడా రేవంత్ రెడ్డి దేశంలో లేని సమయంలో చింతన శిబిరం నిర్వహించడం దేనికి సంకేతం అన్న చర్చ జరుగుతోంది. ఉదయ్ పూర్ డిక్లరేషన్ని జనంలోకి తీసుకెళ్లడం కోసమే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పినా అందుకు కొనసాగింపుగానే తెలంగాణ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మరికొన్ని అంశాలను పొందుపర్చి ఏఐసీసీకి నివేదిస్తామని భట్టి చెప్పిన మాట, ఆశ్వధామ హతః .. అన్నట్లుగా ఉందని అంటున్నారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పొందు పరిచే అంశాలేంటి? అందులో రేవంత్ ‘రెడ్డి’ వ్యాఖ్యల అంశం కూడా ఉంటుందా? అనే ప్రశ్నలకు భట్టి నుంచి సమాధానం లేదు. నిజానికి, ఈ సమావేశంలో చర్చించే విషయాల్లో రేవంత్ రెడ్డి చేసిన వివాదస్పద వ్యాఖ్యలపైనే ప్రధాన చర్చ ఉంటుందని పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. కేవలం ఉదయ్ పూర్ డిక్లరేషన్, పార్టీ భవిష్యత్ కార్యాచరణ పై చర్చించేందుకే చింతన్ శిబిర్’ అయితే, రేవంత్ రెడ్డి విదేశాల నుంచి తరిగి వచ్చిన తర్వాత చింతన్ శిబిర్ ఏర్పాటు చేయవచ్చును కదా, అంత తొందరేమొచ్చింది అని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. అదీ గాక రేవంత్ రెడ్డి నెలలు తరబడి అమెరికాలో ఉండి పోవడం లేదు, పోనీ రేపో మాపో ఎన్నికలు వచ్చి పడుతున్నాయా, అంటే అదీ లేదు.. అలాంటప్పుడు, ఇంతా అర్జెంటుగా చింతన్ శిబిర్’ నిర్వహించవలసిన అవసరం ఏమిటి? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అందుకే, రేవంత్ రెడ్డి రాకపోవడంలో ఎలాంటి వివాదం లేదని భట్టి ఎంత గట్టిగా చెప్పినా, దాల్ మే కుచ్ కాలా హై.. ఏదో వుందనే అభిప్రాయమే పార్టీ వర్గాల నుంచి వినవస్తోంది.
http://www.teluguone.com/news/content/tcongress-chintan-sibir-with-out-revanth-reddy-25-136837.html





