వాళ్ళు సర్వ నాశనమైపోతారు..
Publish Date:Mar 23, 2021
Advertisement
దేవుడి సొమ్ములను టచ్ చేయాలంటే.. జనం భయపడి వెనక్కు తగ్గే రోజులు పోయాయి. దేవుడి సొమ్ములు ఆస్తులు అయితే మాత్రం ఏంటి నొక్కేద్దామనే ఆలోచనలు ప్రస్తుతం జనంలో బాగా పెరిగిపోయాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక దేవాలయాలు సొంత భూములు, ఆస్తులు ఉన్నా నిత్య ధూప, దీప నైవేద్యాలకు కూడా నోచుకోకుండా ఉన్నాయి. అంతేకాకుండా ఇలా దేవుడి ఆస్తులు, సొమ్ములు బొక్కేసే వారిలో బడాబాబుల హస్తాలు కూడా ఉన్న సంగతి తెల్సిందే. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి ఒక దేవాలయం దుస్థితి వెలుగు చూసింది. ఈ ఆలయ పారిస్తాటిని చూసి విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని గుళ్ళ సీతారామపురం ఆలయమ యొక్క దుస్థితిని చూసిన ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా స్వామీజీ నేడు గుళ్ళ సీతారామపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడి ఆలయానికి మూడు వేల ఎకరాల భూములున్నా.. ఈ ఆలయం నిర్లక్ష్యానికి గురి కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఆలయ భూముల్ని అన్యాక్రాంతం చేసిన, ఆక్రమించిన వారికి నాశనం తప్పదన్నారు. వారు దోచుకున్న భూముల్ని అలయానికి తిరిగి అప్పగించాలని స్వాత్మానందేంద్ర స్వామి డిమాండ్ చేశారు. గుళ్ళ సీతారామపురం ఆలయ దుస్థితిపై రాష్ట్ర దేవాదాయ శాఖతో చర్చిస్తామన్నారు. వచ్చే శ్రీరామనవమి వేడుకలకు విశాఖ శారదాపీఠం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను పంపిస్తామన్నారు. అంతేకాకుండా సీతారాములకు వెండి కిరీటాలను కూడా చేయిస్తామని స్వాత్మానందేంద్ర స్వామి పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/svathmanandendra-swami-fires-on-temple-land-grabbers-25-112382.html





