political-news-img

కవిత పార్టీ ప్రకటన సభకు అట్టహాసంగా ఏర్పాట్లు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం తెలంగాణ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి వేదికగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో సాంస్కృతిక విప్లవానికి ఊతమిచ్చేలా తెలంగాణ జాగృతిని స్థాపించిన కవిత, తన 20 ఏళ్ల ప్రజా జీవితంలో ఎన్నో మైలురాళ్లు దాటడంతో పాటు పలు రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం స్వీయ రాజకీయ శక్తి అవసరమనే నినాదంతో ఆమె నేడు కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. అద్వయ కన్వెన్షన్ సెంటర్‌తో పాటు దానికి ఆనుకుని ఉన్న 20 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభా ప్రాంగణం నుంచి పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. కవిత కార్యక్రమాల షెడ్యూల్ ఇలా ఉంది: • ఉదయం 7.30 గంటలకు బంజారాహిల్స్‌లోని నివాసం నుంచి ర్యాలీగా అమరవీరుల స్తూపానికి బయల్దేరుతారు • ఉదయం 8.15 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు • ఉదయం 8.25 గంటలకు అక్కడి నుంచి బయల్దేరుతారు • ఉదయం 9.30 గంటలకు మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ హాల్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంటారు • ఉదయం 10.00 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు • ఉదయం 10.05 గంటలకు ప్రసంగం ప్రారంభిస్తారు • గంటా పావు నుంచి గంటన్నర వరకు కవిత ప్రసంగించే అవకాశం ఉంది సభా ప్రాంగణానికి ప్రత్యేక పేర్లు కూడా ఖరారు చేశారు: • సభా ప్రాంగణం – ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం • ప్రధాన ద్వారం – ప్రజాకవి కాళోజీ నారాయణరావు ద్వారం • ఇతర ద్వారాలు – రాణి రుద్రమదేవి ద్వారం, మారోజు వీరన్న ద్వారం, చాకలి ఐలమ్మ ద్వారం కవిత ప్రకటించబోయే కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Publish Date: Apr 24, 2026 9:10PM

political-news-img

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొత్త నియామకాలకు ఆమోదం తెలిపింది. సాధారణ పరిపాలన విభాగం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ మార్పులు మే 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. హోం శాఖ ప్రధాన కార్యదర్శిగా శిఖా గోయల్ ప్రస్తుతం విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా పనిచేస్తున్న శిఖా గోయల్‌ను హోం శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ బాధ్యతలను కూడా ఆమె అదనంగా నిర్వహించనున్నారు. విజిలెన్స్ డీజీగా దేవేంద్ర సింగ్ చౌహాన్ అడిషనల్ డీజీపీ (పర్సనల్)గా ఉన్న దేవేంద్ర సింగ్ చౌహాన్‌ను విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. ఈ పదవికి సంబంధించిన ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలను కూడా ఆయన నిర్వహించనున్నారు. మల్టీజోన్–2 ఐజీపీగా షానవాజ్ ఖాసిం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా ఉన్న షానవాజ్ ఖాసిం ను మల్టీజోన్–2 ఐజీపీగా బదిలీ చేశారు. ఐజీపీ (పర్సనల్)గా అదనపు బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించారు. ఫ్యూచర్ సిటీ సీపీగా డాక్టర్ తరుణ్ జోషి యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ తరుణ్ జోషిని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుత సీపీ జి. సుధీర్ బాబు ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. డ్రగ్స్ కంట్రోల్ డీజీగా అవినాష్ మొహంతి సైబరాబాద్ (మల్కాజిగిరి) పోలీస్ కమిషనర్‌గా ఉన్న అవినాష్ మొహంతిని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా బదిలీ చేశారు. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డైరెక్టర్ బాధ్యతలతో పాటు ఏసీబీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను కూడా ఆయన చేపట్టనున్నారు. మల్కాజిగిరి సీపీగా బి. సుమతి ఇంటెలిజెన్స్ విభాగం ఐజీపీగా ఉన్న బి. సుమతిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా నియమించారు. కార్తికేయకు అదనపు బాధ్యతలు ఇంటెలిజెన్స్ ఐజీపీగా ఉన్న కార్తికేయకు ఎస్‌ఐబీ (ఇంటెలిజెన్స్) ఐజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ బదిలీలతో రాష్ట్ర పోలీసు వ్యవస్థలో కీలక విభాగాలకు కొత్త నాయకత్వం లభించనుంది. పరిపాలన మరింత సమర్థవంతంగా కొనసాగేందుకు ఈ మార్పులు దోహదపడతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Publish Date: Apr 24, 2026 8:57PM

political-news-img

వాట్సాప్‌లోనే విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్

తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది.. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల రిపోర్ట్ కార్డులు ఇప్పుడు తల్లిదండ్రుల చేతికి చేరేందుకు స్కూల్‌కి వెళ్లాల్సిన అవసరం లేదండోయ్. రిపోర్ట్ కార్డులు నేరుగా మీ ఫోన్ కే వస్తాయండోయ్...రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ డిజిటల్ కార్యక్రమంతో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల వార్షిక ప్రోగ్రెస్ రిపోర్టులు నేరుగా వాట్సాప్ ద్వారా పంపిణీ అయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా 18 లక్షలకు పైగా విద్యార్థుల రిపోర్ట్ కార్డులు తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు చేరాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో మీ సేవ సేవల ద్వారా అమలు చేసిన ఈ వినూత్న చర్య విద్యా రంగంలో డిజిటల్ మార్పుకు నాంది పలికింది. సబ్జెక్టుల వారీగా మార్కులు, హాజరు శాతం వంటి పూర్తి వివరాలతో రిపోర్ట్ కార్డులు పంపించడం వల్ల తల్లిదండ్రులు వెంటనే పిల్లల విద్యా ప్రగతిని తెలుసుకునే అవకాశం లభించింది. ఇక స్కూల్‌కి వెళ్లి రిపోర్ట్ కార్డు తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతున్నాయి. పూర్తిగా పేపర్‌లెస్ విధానం అమలు కావడంతో పరిపాలనలో పారదర్శకత, వేగం కూడా పెరిగింది. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సాంకేతిక సేవలు చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌కు మరో మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యా రంగంలో సాంకేతికతను వినియోగిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు భవిష్యత్తులో మరిన్ని డిజిటల్ సేవలకు దారితీయనుందని అధికారులు భావిస్తున్నారు.

Publish Date: Apr 24, 2026 8:48PM

political-news-img

బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్‌కు 14 రోజుల రిమాండ్

కూకట్‌పల్లి పరిధిలో జరిగిన దాడి కేసులో మన్నే క్రిషాంక్ సహా 8మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వాదోపవాదనలు పూర్తైన తర్వాత మెజిస్ట్రేట్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు కూకట్పల్లి పరిధిలోని దయార్గూడలో చోటుచేసుకుంది. టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినే టర్ గుండమల్ల రాజేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 23న మధ్యాహ్నం సుమారు 12:45 గంటల సమయంలో కూకట్‌పల్లిలోని తన నివాసంలో ఉన్న రాజేంద్ర కుమార్ ఇంటికి, భారత్ రాష్ట్ర సమితి సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ అనుచరులతో కలిసి వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌లో తనపై చెడు ప్రచారం ఎందుకు చేస్తున్నావని ప్రశ్నిస్తూ, అతనిపై దాడి చేశారని ఆరోపించారు. పిడిగుద్దులతో కొట్టడమే కాకుండా చంపేస్తానంటూ బెదిరించారని తెలిపారు. అంతేకాదు, ఘటనను మొబైల్‌లో రికార్డ్ చేయడానికి ప్రయత్నించగా ఫోన్‌ను లాక్కుని నేలపై పడేసి ధ్వంసం చేశారని చెప్పారు. ఈ సమయంలో స్థానికులు అక్కడికి చేరుకో వడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న మేడ్చల్– మల్కాజ్‌గిరి పరిధిలోని 12వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు, మన్నే క్రిషాంక్ సహా 8 మందికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Publish Date: Apr 24, 2026 8:37PM

political-news-img

కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులకు హైకోర్టులో ఊరట

తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మంత్రి కే తారక రామారావు, మాజీ మంత్రి టి హరీశ్ రావులకు పెద్ద ఊరట లభించింది. 2011లో నమోదైన కేసులను హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ కొట్టివేసింది. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా 2011 మార్చిలో హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్‌పై భారీగా “మిలియన్ మార్చ్” నిర్వహించబడింది. రాష్ట్ర విభజనకు మద్దతుగా నిర్వ హించిన ఈ కార్యక్రమానికి వేలాదిమంది ఉద్యమకారులు హాజరయ్యారు. ఆ రోజు నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో కొందరు ఆందోళనకారులు మీడియా సంస్థల కెమెరాలు, ఓబీ వ్యాన్లు ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆ సమయంలో ఉద్యమానికి నేతృత్వం వహించిన పలు వురు ప్రముఖ నాయకులను కూడా కేసులో నిందితులుగా చేర్చారు.దర్యాప్తు సమయంలో కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల పేర్లు చేర్చడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ కేసులపై ముగ్గురు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తమకు ప్రత్యక్ష సంబంధం లేదని వారి తరఫు న్యాయవాది రమణారావు కోర్టులో వాదనలు వినిపించారు. పిటీషనర్ల వాదనలు, కేసు వివరాలు పరిశీలించిన హైకోర్టు, ముగ్గురు నేతలపై నమోదు చేసిన కేసులకు తగిన ఆధారాలు లేవని అభిప్రాయపడింది. కేసుతో పిటీషనర్లకు ప్రత్యక్ష సంబంధం నిరూపించలేక పోయారని పేర్కొంటూ, హైకోర్టు కేసులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు దశాబ్దానికి పైగా కొనసా గుతున్న ఈ కేసులకు ముగింపు పలకడంతో, తెలంగాణ ఉద్యమ కాలానికి సంబంధించిన ఒక కీలక అధ్యాయం ముగిసినట్లైంది. ముగ్గురు నేతలకు కోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద ఊరటను ఇచ్చింది.

Publish Date: Apr 24, 2026 7:28PM

political-news-img

ఇక ప్రభుత్వం చేతిలోకి మెట్రో...ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ మెట్రో రైలును ఈ ఏప్రిల్ నెలాఖరుకు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమైంది. దానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు.. ఎల్ అండ్ టీతో ఒప్పందం ఇప్పటికే పూర్తయ్యాయి. వాస్తవానికి మార్చి 31 నాటికి మెట్రో ప్రాజెక్ట్ ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వ పరం అయ్యేందుకు వీలుగా ప్లాన్ జరిగినప్పటికీ.. స్వాధీన ప్రక్రియకు అవసరమైన దాదాపు రూ.13,615 కోట్ల రుణం ప్రభుత్వానికి రాకపోవడంతో ఆలస్యమైంది. మెట్రో మొదటిదశ స్వాధీన ప్రక్రియకు అవసరమైన రుణాన్ని ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఓకే చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఒప్పందం.. డాక్యుమెంట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పీపీపీ పద్దతిలో ఎల్ అండ్ టీ - తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టును పూర్తిగా టేకోవర్ చేసుకోవటానికి రేవంత్ సర్కారు నిర్ణయించింది. అయితే.. స్వాధీన ప్రక్రియతో ముడిపడి ఉన్న పలు అంశాలు.. మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిపార్సులను తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. ఆమోదం తెలిపారు. ఐఆర్ఎఫ్ సీ ఇచ్చే దాదాపు రూ.13,615 కోట్ల రుణాన్ని 20 ఏళ్ల కాల వ్యవధిలో మెట్రో రైలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది. కీలక అంశం ఏమంటే.. ఐఆర్ఎఫ్ సీ తొలుత అంగీకరించిన రూ.12,750 కోట్ల కంటే తాజాగా రూ.13,615 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఐఆర్ఎఫ్ ఎసీ రుణంగా ఇచ్చిన మొత్తానికి అదనంగా ఇవ్వాల్సిన మొత్తాన్ని హెచ్ఎండీఏ ఇవ్వనుంది. ఈ మొత్తం తక్షణం అందజేస్తేనే గడువు లోపు లావాదేవీ పూర్తి అవుతుందని హెచ్ఎంఆర్ఎల్ ప్రభుత్వాన్ని కోరగా.. ఈ అంశాన్ని మంత్రివర్గంలో చర్చించారు. మెట్రో స్వాధీనం తర్వాత నిర్వాహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్ ఉద్యోగులు 115 మందిని ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకు అయ్యే వేతనాల ఖర్చును కూడా హెచ్ఎంఆర్ఎల్ భరిస్తుంది. అదే సమయంలో మెట్రో కార్యకలాపాలపై సూచనలు.. సలహాల కోసం ఆర్నెల్ల కాలానికి ఎల్ అండ్ టీకి చెందిన సీనియర్ ఎక్స్ పీరియన్స్ అధికారిస్థాయిలోని ఏడుగురి సేవల్ని ప్రభుత్వం తీసుకోనుంది. దీనికి అయ్యే ఖర్చును ఎల్ అండ్ టీ భరిస్తుంది. వివిధ దశలను దాటి.. ఫైనల్ గా హైదరాబాద్ మెట్రో ఈ నెలాఖరు నాటికి తెలంగాణ ప్రభుత్వ పరం కానుంది.

Publish Date: Apr 24, 2026 7:19PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img