పవన్ కల్యాణ్ కుడి భుజానికి సర్జరీ.!
Publish Date:Jul 11, 2026
Advertisement
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. భుజానికి సంబంధించిన శస్త్రచికిత్సను అక్కడి వైద్యులు శనివారం (జులై 11) దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ సర్జరీ అనంతరం పవన్ కళ్యాణ్ను ప్రత్యేక వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. విషయమేంటంటే.. పవన్ కళ్యాణ్ రెండు భుజాల రొటేటర్ కఫ్ కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే రెండు భుజాలకూ ఒకేసారి శస్త్రచికిత్స చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో.. వైద్యులు మొదట కుడి భుజానికి సర్జరీ పూర్తి చేశారు. ఎడమ భుజానికి మరో రెండు నెలల తర్వాత సర్జరీ చేయనున్నారు.ఓ సినిమా షూటింగ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో పవన్ కళ్యాణ్కు భుజాలకు గాయమైంది. ఆ సమయంలోనే వైద్యులు పూర్తి విశ్రాంతిని సూచించారు. అయితే.. అప్పటికే రాజకీయంగా క్రియాశీలకంగా మారడంతో పవన్ కల్యాణ్ వైద్యులు సూచించిన విధంగా విశ్రాంతి తీసుకోలేకపోయారు. వారాహి యాత్ర, సార్వత్రిక ఎన్నికల ప్రచారాల్లో జనసేనానితో అభిమానులు, పార్టీ కార్యకర్తలు కరచాలనం చేయడం, చేతులు పట్టుకుని లాగడం వంటివి చేశారు. దీంతో చిన్నదిగా ఉన్న సమస్య తీవ్రమైన కండరాల చీలికగా మారింది. భుజాల నొప్పి తీవ్రం కావడంతో పవన్ కల్యాణ్ గత వారం ముంబై వెళ్లి కొకిలా బెన్ అంబానీ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. వారు వెంటనే సర్జరీ అవసరమని చెప్పినప్పటికీ.. ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాలు ఉండటంతో పవన్ సర్జరీని వాయిదా వేసుకున్నారు. ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని శుక్రవారం (జులై 10)న ముంబై ఆస్పత్రిలో చేరారు. శనివారం (జులై 11) ఉదయం వైద్యలు ఆయనకు సర్జరీ చేశారు. భుజానికి ఆపరేషన్ చేయించుకున్న పవన్ కళ్యాణ్ను ప్రధాని నరేంద్ర మోదీ శ ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే.. తెలుగేదేశం అధినేత చంద్రబాబు, పలువురు మంత్రులు, జనసేన నేతలు, చిరంజీవి పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పలువురు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పేడుతున్నారు.
http://www.teluguone.com/news/content/surgery-to-pawan-kalyan-shoulder-36-225715.html





