కేసుల ఉపసంహరణకు రాష్ట్రాల ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ.. క్లారిటీ ఇచ్చిన సుప్రీం.!
Publish Date:Aug 4, 2026
Advertisement
దేశవ్యాప్తంగా యువత, విద్యార్థి లోకం చేపట్టిన ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు జులై 20న చలో సంసద్ ర్యాలీలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, పోలీసుల లాఠీచార్జి, బాష్పవాయు గోళ ప్రయోగాల నేపథ్యంలో దాఖలైన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జైమాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం (ఆగస్టు 3) కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యాయ ప్రక్రియ ప్రకారం ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై నమోదైన ఎఫ్ఐఆర్లను మూసివేయడానికి లేదా పూర్తిగా ఉపసంహరించుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి జులై 28న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో నేర చరిత్ర లేని విద్యార్థులపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకూడదు అని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే.. నేర చరిత్ర అనే పదం చట్టపరంగా స్పష్టత లేకుండా ఉందనే అంశాన్ని పిటిషనర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చిన్న చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలు లేదా నిరసన కేసుల వల్ల యువకుల భవిష్యత్తు నాశనం కాకూడదని న్యాయవాదులు వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, జులై 28 ఆదేశాల్లోని నేర చరిత్ర అనే పదాన్ని కేవలం తీవ్రమైన, దారుణమైన నేరాలు అని మాత్రమే పరిగణించాలని క్లారిటీ ఇచ్చింది. దొంగతనాలు, నిరసనలు లేదా చిన్న గొడవలు వంటివి విద్యార్థుల కేసుల ఉపసంహరణకు అడ్డంకి కాకూడదని పేర్కొంది. ఈ ఆందోళనకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే.. పోటీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు, నీట్ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో జూన్ 6వ తేదీ నుండి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. విద్యార్థి యూనియన్లు, కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో చేపట్టిన పోరాటం ఫలితంగా అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జులై 25న రాజీనామా చేశారు. అయితే జులై 20న నిర్వహించిన చలో సంసద్ ప్రదర్శన సమయంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, పెల్లెట్ తుపాకులు వాడటంతో తీవ్ర అలజడి రేగింది. ప్రశాంత్ కుమార్ సింగ్, షేక్ ఇర్షాద్ మన్సూరి వంటి యువకులు పెల్లెట్ గాయాలపాలై కోర్టును ఆశ్రయించారు.అటు ఢిల్లీలోనే కాక బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ వంటి పలు రాష్ట్రాల్లోనూ ఈ విద్యార్థి ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. జులై 25న బీహార్లోని సీవాన్ జిల్లాలో నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు.
http://www.teluguone.com/news/content/supreme-court-student-protest-verdict-36-227987.html





