గానకోకిల ఎస్. జానకి.. జీవిత విశేషాలు..!
Publish Date:Jul 12, 2026
Advertisement
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గానకోకిల ఎస్. జానకి మరణంతో భారతీయ సంగీత రంగం ఓ అపూర్వ గానమణిని కోల్పోయింది. పూర్తి పేరు శిష్ట్లా శ్రీరామమూర్తి జానకి. 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా, రేపల్లె మండలం, పల్లపట్ల గ్రామంలో జన్మించారు. అభిమానులు ఆమెను ప్రేమగా గానకోకిల, జానకమ్మ, "నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా" అని పిలుచుకునేవారు. 1957లో సినీ నేపథ్య గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన జానకి, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు 20కు పైగా భాషల్లో వేలాది పాటలు ఆలపించారు. సినీ గీతాలు, భక్తి గీతాలు, జానపద, శాస్త్రీయ సంగీతం... ఏ ప్రక్రియ అయినా తన స్వర మాధుర్యంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. దాదాపు 48 వేలకుపైగా పాటలు పాడి భారతదేశంలోనే అత్యంత గొప్ప నేపథ్య గాయనిలలో ఒకరిగా చిరస్థాయిగా నిలిచారు. తెలుగులో "సిరిమల్లె పువ్వా", "మౌనమేలనోయి", "గువ్వా గోరింకతో", "ఏ దివిలో విరిసిన పారిజాతమో" వంటి ఎన్నో చిరస్మరణీయ గీతాలతో సంగీతాభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. తన గాన ప్రస్థానంలో నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులు, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తమ గాయని పురస్కారాలు అందుకున్నారు. 2013లో ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని వినయపూర్వకంగా తిరస్కరించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. స్వరంలోని భావ వ్యక్తీకరణ, అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ జానకి ప్రత్యేకత. చిన్నారి నుంచి వృద్ధురాలి వరకు ఏ పాత్రకైనా తగ్గట్టుగా స్వరాన్ని మార్చి పాడగల అరుదైన ప్రతిభ ఆమె సొంతం. 2017లో సినీ గానానికి వీడ్కోలు పలికినా, ఆమె పాటలు నేటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. జానకమ్మ భర్త వి. రామప్రసాద్ 1997లోనే మరణించగా, ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ సైతం ఇదే ఏడాది జనవరిలో కన్నుమూశారు. జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె సంగీత సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ... "ప్రఖ్యాత గాయని ఎస్. జానకి అమ్మ మరణం సంగీత, సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటు. వివిధ భాషల్లో ఆమె ఆలపించిన పాటలు తరతరాలుగా ప్రజాదరణ పొందాయి. ప్రతి భావోద్వేగానికి ఆమె తన స్వరంతో ప్రాణం పోశారు. ఆమె మధుర గానం రాబోయే తరాల శ్రోతలను కూడా మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటుంది" అని పేర్కొన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జానకి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతీయ సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మైసూర్లో అంతిమ వీడ్కోలు పలకనున్నారు. కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజల సందర్శనార్థం మైసూర్లోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్లో ఉంచనున్నారు. అభిమానులు, సినీ, సంగీత ప్రముఖులు ఈ సమయంలో నివాళులర్పించేందుకు అవకాశం కల్పించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు మైసూర్ నగర శివారులోని కుటుంబానికి చెందిన ప్రైవేట్ ఫామ్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ, సంగీత రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. ఫ్యాన్స్ భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/singer-s-janaki-love-story-36-225803.html





