విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన మలుపు!
Publish Date:Jun 25, 2026
Advertisement
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఈ హైప్రొఫైల్ కేసులో తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజును పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ మిస్సింగ్ ఉదంతం వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ఇటు లీగల్ వర్గాల్లోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసలు సాయికృష్ణ మిస్సింగ్ వెనుక ఏం జరిగింది, ఒక పోలీస్ అధికారి అరెస్ట్ వరకు ఈ వ్యవహారం ఎందుకు దారితీసింది అనే కోణంలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ పరిణామంపై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ఈ కేసు తీవ్రతను గమనించిన కోర్టు ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని గట్టిగా నిలదీసింది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం, జూన్ 29వ తేదీ లోపు పూర్తి వివరాలతో కూడిన సమాధానాన్ని సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఈ ఉదంతం దేశ రాజధాని ఢిల్లీకి సైతం చేరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తనూజ మరియు గురుమూర్తి ఇద్దరూ కలిసి జాతీయ మానవ హక్కుల కమిషన్ కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు స్థానిక పరిధిలోనే కాకుండా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై భరద్వాజ్.. సిఐ నాగరాజును అరెస్ట్ చేయకుండా తప్పించుకునే పరిస్థితి పోలీసు శాఖకు లేకుండా పోయిందన్నారు. బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ సీఐ బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన తీరు ప్రజా బాహుళ్యంలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందన్నారు. అయితే ఈ సింపతీని పక్కదారి పట్టించడానికి ఒక వ్యూహాత్మక నెరేటివ్ కూడా తెరపైకి వచ్చిందన్న ఆయన.. సాయికృష్ణపై గతంలో ఉన్న 23 క్రిమినల్ కేసుల రికార్డును ఎస్టాబ్లిష్ చేస్తూ, అతనొక ప్రమాదకరమైన గంజాయి పెడ్లర్ అనీ.. అతని వల్ల సమాజానికి ముప్పని ప్రచారం చేయడం ప్రారంభించారు. కృష్ణలంక ప్రాంతంలో మహిళలు రోడ్ల మీదకు వచ్చి కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ సిఐ నాగరాజుకు మద్దతు తెలపడం ప్రత్యేకంగా గుర్తించాలన్నారు. గతంలో సురేంద్రబాబు హయాంలో బుడ్డ శంతన్, పిల్లి దుర్గాప్రసాద్ ఎన్ కౌంటర్ల సమయంలో ఇలాంటి ప్రజా మద్దతు కనిపించినప్పటికీ, చట్టం ముందు ఇవేవీ నిలబడలేదని గుర్తు చేస్తూ ఇప్పుడూ అదే జరుగుతుందన్నారు. కేవలం ఒక పాత నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బిడబ్ల్యూ) అమలు కోసం తీసుకొచ్చిన వ్యక్తిని పోలీస్ స్టేషన్లో ప్రాణాలు పోయేలా కొట్టడం వెనుక ఏదో బలమైన రాజకీయ ఒత్తిడి లేదా మాఫియా ప్రమేయం ఉందని భరద్వాజ్ అన్నారు. సాయికృష్ణ తీవ్రమైన ఇంటరాగేషన్ తట్టుకోలేక మరణించాడని, ఆ తర్వాత అతని మృతదేహాన్ని ఎక్కడో గుర్తుతెలియని బస్టాప్ సమీపంలో అనాథ శవంగా దహనం చేసేశారని ప్రచారం జరుగుతోందనీ. కనీసం తల్లికి బూడిద కూడా దక్కకుండా సాక్ష్యాధారాలను పూర్తిగా తుడిచిపెట్టేయడం వెనుక పెద్ద నెట్వర్క్ ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘోరం వెనుక కేవలం సిఐ నాగరాజు ఒక్కరే లేరని, మొత్తం ఇంటరాగేషన్ టీమ్ కానిస్టేబుళ్లు కూడా ఉన్నారని, అయితే స్టేషన్ హౌస్ ఆఫీసర్గా సిఐ కేంద్రబిందువు అయ్యారని భరద్వాజ్ అన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఆంధ్రప్రదేశ్ను పట్టిపీడిస్తున్న గంజాయి, డ్రగ్స్ సిండికేట్ లింకులు ఉన్నాయన్నారు. కేవలం నైజీరియన్లు లేదా సినిమా వాళ్లే కాకుండా, స్థానిక పొలిటికల్ లీడర్ల అండదండలతో ఈ డ్రగ్ నెట్వర్క్ భారీ ఆర్థిక వనరుగా నడుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో గంగవరం పోర్టులో దొరికిన 4 కంటైనర్ల డ్రగ్స్ ఉదంతం లాగే, ఈ సాయికృష్ణకు కూడా కీలకమైన పొలిటికల్ డ్రగ్ లింకులు ఏమైనా తెలిసి, బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించడం వల్లే ఈ హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు సాగాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును లోతుగా విచారించి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిజాలను బయటపెట్టాలని, సిఐ నాగరాజు నుంచి నేర అంగీకార వాంగ్మూలం (కన్ఫెషన్ స్టేట్మెంట్) తీసుకుని, కేసును ఆయనతోనే ముగించేయడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు భరద్వాజ అనుమానం వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/sensational-turn-in-the-vijayawada-saikrishna-missing-case-25-224129.html





