బీఆర్ఎస్ పనైపోయినట్లేనా? సీనియర్ల వలసల సంకేతం అదేనా?
Publish Date:Mar 28, 2024
Advertisement
అధికారంలో ఉన్న పదేళ్ల పాటు తెలంగాణ రాజకీయాలను కంటిచూపుతో శాసించిన బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. అధికారం కోల్పోయిన తరువాత పార్టీ లీడర్లు, క్యాడర్ ను కాపాడుకోలేక చతికిల పడిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్కొక్కరుగా బీఆర్ ఎస్ పార్టీని వీడుతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ద్వితీయ శ్రేణి నేతల నుంచి సీనియర్ల వరకు బీఆర్ ఎస్ కు గుడ్బై చెప్పేస్తున్నారు. తాజాగా కేసీఆర్కు దగ్గర వ్యక్తులుగా పేరున్న నేతలు సైతం బీఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిపేందుకు అభ్యర్థులు సైతం కరువైన పరిస్థితి. సిట్టింగ్ ఎంపీలు అనేక మంది బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్, బీజేపీల్లో చేరడంతో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారిని బరిలో నిలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తెకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ప్రస్తుతం, ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో పాటు తన తండ్రి కడియం శ్రీహరితో సహా కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. శుక్రవారం (మార్చి 29) వీరిరువురూ హస్తినలో ఢిల్లీ పెద్దలను కలిసి హస్తం కండువా కప్పుకోనున్నారు. కడియం కావ్యను కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నారు. అలాగే కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన కే. కేశవరావుసైతం బీఆర్ ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై గురిపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, గొర్రెల పంపిణీ పథకంతో సహా పలు పథకాల్లో అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసి మరీ రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రతిపక్ష పార్టీల్లోని ముఖ్యనేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు పలువురు పోలీస్ అధికారుల అరెస్టుతో ఫోన్ ట్యాపింగ్ డొంక కదులుతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ ఎస్ ముఖ్యనేతల మెడకు చుట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న అంచనాలతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో బీఆర్ ఎస్ పార్టీలో కొనసాగితే రాజకీయ మనుగడ కష్టమని భావిస్తున్నకొందరు ముఖ్యనేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. నేతలు పార్టీ మారకుండా కేసీఆర్, కేటీఆర్ లు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ కనీస స్థానాలలో కూడా విజయం సాధించడం అనుమానంగానే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా పార్టీ నుంచి వలసలు కూడా రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ ఎస్ సీనియర్ నేతలుగా, కేసీఆర్ కు సన్నిహితులుగా పేరొందిన కే. కేశవరావు, కడియం శ్రీహరి లాంటి వారు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారన్న వార్తలతో బీఆర్ ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వరంగల్ లోక్ సభ నుంచి బీఆర్ ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఇటీవల ఆమె కేసీఆర్ ను కలిసి ఆశీర్వాదం సైతం తీసుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమె పోటీ నుంచి విరమించుకుంటున్నానని లేఖ విడుదల చేయడం బీఆర్ ఎస్ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. బీఆర్ఎస్ పై అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కావ్య తన లేఖలో వివరించారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుండి విరమించుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరూ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీహరితో కాంగ్రెస్ ముఖ్యనేతలు పలు దఫాలుగా భేటీ అయినట్లు సమాచారం. వారం రోజుల క్రితమే శ్రీహరి బీఆర్ ఎస్ ను వీడుతున్నారని ప్రచారం జరిగింది. ఆయన కుమార్తె కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో వారు బీఆర్ ఎస్ లోనే కొనసాగుతున్నారని అందరూ భావించారు. కానీ, ఊహించని రీతిలో కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రటకించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆమె కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారని వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావుసైతం బీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. గురువారం (మార్చి 28) కేసీఆర్ తో భేటీ అయిన కే. కేశవరావు పార్టీని వీడుతున్నట్లు చెప్పినట్లు సమాచారం. దీంతో కేకే తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నీ ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసింది? అంటూ కేకేపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే కేశవరావు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. ఇప్పటికే కేశవరావు కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ శనివారం (మార్చి 30) కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమెతోపాటు అదేరో జు కేశవరావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. కేశవరావుతో పాటు ఇంద్రకరణ్ రెడ్డి, మరికొందరు బీఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సమాచారం. మొత్తానికి అధికారం కోల్పోయిన కొద్ది నెలల్లోనే బీఆర్ ఎస్ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో బీఆర్ఎస్ ఖాళీ అయ్యేందుకు ఎక్కువ కాలం పట్టదని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/seniors-leaving-brs-25-172882.html