సమైక్యాంధ్ర ఉద్యమాలు ఎవరి కోసం
Publish Date:Jul 24, 2013
Advertisement
నిన్న మంత్రి టిజి వెంకటేశ్ మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్ర విభజన జరగకుండా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. కానీ ప్రజల నుండి కనీస స్పందన కూడా రావడం లేదు. సీమంధ్ర ప్రజల ఈ ఉదాసీన వైఖరి వల్లనే కేంద్రం కూడా తెలంగాణా ఏర్పాటుకి సిద్దపడుతోంది. ఇప్పుడు కేంద్రం తెలంగాణ ప్రకటన చేసినట్లయితే, గతంలోలాగా మేము రాజీనామాలుచేసి కేంద్రాన్ని బెదిరించడానికి అవకాశం లేదు. ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే అందుకు తెలంగాణా ప్రజలనే కాక సీమంధ్ర ప్రజలని కూడా నిందించక తప్పదు. కానీ రాష్ట్ర విభజన జరుగకుండా ఆపేందుకు చివరి నిమిషం వరకు మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటాము,” అని ఆయన అన్నారు. ఆయన మాటలు రెండు విషయాలను స్పష్టం చేస్తున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమాలు కేవలం కొందరు వ్యక్తుల స్వార్ధ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కొరకే ప్రేరేరింపబడినవే తప్ప వాటికి సీమంధ్ర ప్రజల మద్దతు లేదని మొదటి నుండి వాదిస్తున్నతెలంగాణా ఉద్యమనేతలు వాదన సరయినదేనని మంత్రి టిజి వెంకటేష్ తన మాటలతో చెప్పకనే చెప్పారు. ఇంత కాలం ప్రజల అభీష్టానికి అనుగుణంగా నడుచుకొంటున్నామని చెప్పుకొస్తున్నఆయన, ఇప్పుడు ప్రజలు తమకు సహకరించడం లేదని ఆరోపించడంలో అర్ధం ఏమిటి? రాష్ట్ర విభజన పట్ల కేవలం ఆయన వంటి రాజకీయ నాయకులకే తప్ప ప్రజలకు అభ్యంతరం లేదని, అయినప్పటికీ రాష్ట్ర విభజన జరుగకుండా అడ్డుకొనేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పడం ప్రజాభీష్టానికి వ్యతిరేఖంగా తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికే నని అర్ధం అవుతోంది. అటువంటప్పుడు ఇక ప్రజలను నిందించడం ఎందుకు? ఎందుకంటే సమైక్యాంధ్ర కోసం తాము చివరి నిమిషం వరకు చాల కృషి చేసామని, అయినప్పటికీ ప్రజల సహకారం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో విభజనకు అంగీకరించవలసి వచ్చిందని సంజాయిషీలు చెప్పుకొంటూ, సమైక్యాంధ్ర కోసం పోరాడిన వీరులుగా తమకు తాము భుజకీర్తులు తగిలించుకొని, రేపు కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రరాష్ట్రంలో కీలకమయిన మంత్రి పదవులు చెప్పట్టడానికి మార్గం సుగమం చేసుకోవడానికే. ఇటువంటి నేతల ‘సమైక్య పోరాటాల’ లక్ష్యాలు తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికే తప్ప సమైక్యాంధ్ర కోసం మాత్రం కాదు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కొత్త రాజధాని ఏర్పరుచుకోవడం, హైకోర్టు, శాసన సభ, సచివాలయం వంటి వందలాది ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం మరియు మౌలిక వసతులు ఏర్పాటు కొరకు పెద్ద ఎత్తున రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మొదలవుతుంది. అందుకు కేంద్రం నుండి వేల కోట్లో లేక లక్ష కోట్లో నిధులు వచ్చిపడతాయి. అటువంటి పరిస్థితుల్లో నిర్మాణ రంగం, వివిధ వ్యాపారాలు, కాంట్రాక్టులు వంటి సైడ్ బిజినెస్సులు చేసుకొంటున్నమంత్రులు, యంయల్యేలు, యంపీల మధ్య కొత్తగా ఏర్పడే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమయిన మంత్రి పదవులకు కోసం తీవ్రపోటీ ఉంటుంది. అవి దక్కించుకోవాలంటే ప్రజల మద్దతు కూడా భారీగా ఉండాలి. అందుకే ఈ సమైక్య పోరాటాలు. ఈ రోజు మంత్రి టిజి వెంకటేశ్ మొదటిగా సంజాయిషీ చెప్పుకోవడం చూసిన రాష్ట్ర ప్రజలు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణా ప్రకటన చేసిన తరువాతనో లేక ముందుగానో మిగిలిన వారు కూడా దాదాపు ఇటువంటి సంజాయిషీలే చెప్పుకొని తమ సమైక్య పోరాటాలకు స్వస్తి చెప్పి తమ రాజకీయ భవిష్యత్తు కోసం కృషి మొదలుపెడతారు. అంతిమంగా దీనివల్ల ఋజువయిన విషయం ఏమిటంటే, ప్రజల మద్దతు లేని ఉద్యమాల ముగింపు ఈవిధంగా ఉంటే, మద్దతు ఉన్నవి తెలంగాణా ఏర్పాటు వంటి అసాధ్యాన్ని కూడా సుసాద్యం చేసి చూపుతాయని తేలింది.
http://www.teluguone.com/news/content/samaikyandhra-agitations-37-24564.html