విశాఖ తీరానికి రష్యా కెమికల్ దిగ్గజం?
Publish Date:Jun 3, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటన'సాగుతోంది. మాస్కోలో జరిగిన ఒక అత్యంత కీలకమైన సమావేశం ఇప్పుడు ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది. రష్యాలో గ్యాస్ ఫీల్డ్స్, మిథనాల్ కెమికల్ ప్రాజెక్టులను అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రపంచ ప్రసిద్ధ రసాయన దిగ్గజ సంస్థ 'స్ కెమ్ గ్రూప్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ ఇల్యా కోసిహ్, అంతర్జాతీయ వ్యాపార విభాగాధిపతి దర్యా అషానియాలతో కూడిన ఉన్నతస్థాయి బృందంతో ఆయన చర్చలు జరిపారు. నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీరప్రాంత రూపురేఖలను మార్చేసేలా లోకేష్ వారి ముందు ఉంచిన ప్రతిపాదనలు పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అపారమైన అవకాశాలను.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను రష్యా బృందానికి మంత్రి లోకేష్ సమర్థవంతంగా వివరించారు. భారతదేశం భారీ ఎత్తున దిగుమతి చేసుకునే పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ను మన దేశంలోనే ప్రాసెస్ చేసేందుకు వీలుగా ఒక ప్రణాళికను, ప్రతిపాదనను లోకేష్ ఈ సందర్భంగా వారి ముందు ఉంచారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలోని విశాఖపట్నం, కాకినాడ పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ పరిధిలో రస్ కెమ్ ఆధ్వర్యంలో ఒక అత్యాధునిక ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ఆయన రస్ కెమ్ ను ఆహ్వానించారు. కేవలం ప్లాంట్ ఏర్పాటు మాత్రమే కాకుండా.. సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోర్టు ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్ల నిర్మాణం, బల్క్ కెమికల్ స్టోరేజీ వసతులు, ప్రత్యేక వాటర్ ఫ్రంట్ బెర్త్ల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఏపీలో ఉన్న అద్భుతమైన మానవ వనరులు, సాంకేతిక నైపుణ్యాన్ని వాడుకుంటూ ఒక కొలాబరేటివ్ పాలిమర్ అప్లికేషన్, మెటీరియల్ సైన్స్ పరిశోధన కేంద్రాన్ని స్థాపించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, తక్కువ కర్బన ఉద్గారాలు వెలువరించే రసాయనాల తయారీ యూనిట్ను నెలకొల్పాలని కోరారు. మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనలపై రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ ఇల్యా కోసిహ్ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే తాము భారతదేశంలో ప్రత్యేక ఎస్పీవీల ద్వారా హోల్సేల్ కెమికల్ పంపిణీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక భారత సంస్థలతో కలిసి పనిచేసేందుకు తమకు ఆసక్తి ఉందని, ప్రస్తుతం ముంబై, కాన్పూర్లలో ఉన్న పంపిణీ కేంద్రాల ద్వారా దేశంలోని వివిధ పరిశ్రమలకు అవసరమైన రసాయనాలను సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో గనుక ప్రాంతీయ సరఫరా కేంద్రం ఏర్పాటైతే, విశాఖపట్నం, కాకినాడ నగరాల్లో ఉన్న వందలాది ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలకు అవసరమైన అత్యంత కీలకమైన రసాయనాలను నేరుగా అందించే అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. భారతదేశంలోని భారీ పెట్రోకెమికల్ ప్లాంట్లను ఉపయోగించుకుని తమ గ్లోబల్ ఖాతాదారులకు స్థిరమైన సరఫరా అందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి లోకేష్ ప్రెజెంటేషన్, ప్రతిపాదనలను ప్రశంసించిన ఇల్యా కోసిహ్, వీటిపై తమ సంస్థ ఉన్నతస్థాయి బృందంతో సమగ్రంగా చర్చించి, అతి త్వరలోనే ఏపీలో పెట్టుబడులపై ఒక తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ గనుక కార్యరూపం దాల్చితే ఏపీ తీరప్రాంతం గ్లోబల్ కెమికల్ హబ్గా మారడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/russian-chemical-giant-heading-to-visakhapatnam-coast-36-221728.html





