కొండాకే టికెట్ కన్ఫామ్.. కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఖాయం?
Publish Date:Aug 21, 2021
Advertisement
హుజురాబాద్ పోరులో కాంగ్రెస్కు కొండంత బలం వచ్చింది. పోటీకి కొండా సురేఖ పేరు దాదాపు కన్ఫామ్ అయింది. నేడోరేపో అధికారికంగా ప్రకటన రానుంది. దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని కమిటీ కొండా పేరును అధిష్టానానికి పంపించింది. అక్కడ గ్రీన్సిగ్నల్ పడినట్టే తెలుస్తోంది. ఇక హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు వెల్లడించడమే తరువాయి. అదే జరిగితే.. ఇటు టీఆర్ఎస్.. అటు బీజేపీకి.. దబిడి దిబిడే. హుజురాబాద్ పోరులో ఇప్పుడు కాంగ్రెస్కే అధిక ఆధిక్యం కనిపిస్తోంది. హుజురాబాద్ టీఆర్ఎస్ రెండుగా చీలిపోయింది. కొందరు కారులోనే ఉండిపోగా.. మరికొందరు ఈటల వెంట బీజేపీలో చేరిపోయారు. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అంతే బలంగా ఉంది. కౌశిక్రెడ్డి వెంట వెళ్లింది అతి తక్కువ మందే. కాంగ్రెస్ ఓటుబ్యాంకు ఇప్పటికీ అంతే పదిలంగా ఉంది. గత ఎన్నికల్లో హస్తం గుర్తుకు 60వేలకు పైగా ఓట్లు పడ్డాయి. ఈటలకు లక్ష పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఆ లెక్కన.. ఈటలకు వచ్చిన ఆ లక్ష ఓట్లనే ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ పంచుకోవాల్సి ఉంటుంది. అంటే.. గత ఓట్ల శాతం ప్రకారం హుజురాబాద్లో టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్.. మూడు పార్టీలకు సుమారు 50వేల ఓట్లు చొప్పున దాదాపు సమాన బలం ఉన్నట్టు తెలుతోంది. ఇప్పుడు హుజురాబాద్ బైపోల్లో ఆ ఓట్ల తరాజు ఏ పార్టీ వైపు మొగ్గుతుందో వారిదో విజయం. కాంగ్రెస్ రేసులోకి రావడంతో.. ఇప్పుడు పార్టీల కంటే అభ్యర్థులే కీలకంగా మారారు. మూడు పార్టీల నుంచి ముగ్గురు హేమాహేమీలు రంగంలో ఉన్నారు. ముగ్గురిలో టీఆర్ఎస్ అభ్యర్థే కాస్త బలహీనం. గెల్లు శ్రీనివాస్ యాదవ్కు విద్యార్థి నాయకుడిగా మంచి ఇమేజ్ ఉన్నా.. హుజురాబాద్లో ఆయన వెనుక పట్టుమని పది మంది కూడా లేని దుస్థితి. గెల్లు బరిలో ఉన్నా.. కేసీఆరే పోటీలో ఉన్నట్టు ప్రచారం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కారు గుర్తును చూసి ఓటు వేయమంటూ వేడుకుంటోంది. అటు, ఈటల+బీజేపీ మాత్రం మాంచి జోరు మీదుంది. ఆ జోరుకు దళిత బంధుతో బ్రేకులు వేయాలనేది కేసీఆర్ ఎత్తుగడ. అయితే, అది ఆయనకే బూమరాంగ్గా మారి మిగతా వర్గాలను దూరం చేసే ప్రమాదం ఏర్పడింది. హుజురాబాద్లో ఇంత రాజకీయ డ్రామా నడుస్తుండగా.. కాంగ్రెస్+రేవంత్రెడ్డి+కొండా టీమ్ ఎంట్రీ ఇస్తుండటంతో పొలిటికల్ ఈక్వేషన్స్ అమాంతం మారిపోతున్నాయి. హుజురాబాద్లో బలమైన ఓటు బ్యాంకున్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలిచి అందరికీ షాక్ ఇవ్వాలని డిసైడ్ అయింది. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇమేజ్ ఆ పార్టీకి బాగా అడ్వాంటేజ్. రేవంత్రెడ్డిని చూసి ఓట్లేసే వారి సంఖ్య చాలానే ఉంటుంది. ఇక, తాజాగా హస్తం పార్టీ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు ఖరారు కావడం.. కాంగ్రెస్కు మరింత బలం చేకూర్చినట్టైంది. పోల్ మేనేజ్మెంట్లో కొండా దంపతులు ఫుల్స్ట్రాంగ్. ఎవరిని ఎలా డీల్ చేయాలో.. కొండా మురళీకి తెలిసినంతగా మరెవరికీ తెలీదనే టాక్ ఉంది. నయానో, భయానో.. అందరినీ తనవైపు తిప్పుకోవడంలో కొండా మురళీ తర్వాతే ఎవరైనా అని అంటారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కొండా ఆధిపత్యం ఉంది. ఇటు రేవంత్రెడ్డి ఇమేజ్.. అటు కొండా పవర్ తోడైతే.. హుజురాబాద్లో కాంగ్రెస్కు కొండంత బలం పక్కా. ఇక, కొండా సురేఖ అభ్యర్థిత్వంతో సోషల్ ఇంజనీరింగ్ సైతం అద్భుతంగా పని చేస్తుందని అంటున్నారు. హుజురాబాద్లో బీసీల సంఖ్యే అధికం. కొండా సురేఖ పద్మశాలి.. కొండా మురళీ మున్నూరుకాపు.. ఆ రెండు వర్గాల ఓట్లు 70వేలకు పైనే ఉన్నాయి. ఆ సంఖ్య దళిత ఓటు బ్యాంకుకంటే ఎక్కువే. అందుకే దళితబంధుతో అసూయగా ఉన్న బీసీ వర్గాలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదంటున్నారు. ఈటలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తుండటం.. కారు పార్టీని దెబ్బకొట్టేలా బీజేపీ+ఈటల కాలు దువ్వుతుండటం.. పిల్లి పోరు పిల్లి పోరు మధ్యలో నక్క లాభపడినట్టు.. హుజురాబాద్ గెలుపును కాంగ్రెస్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యం అవసరం లేదంటున్నారు. ఇప్పటికే రేవంత్రెడ్డితో హస్తం శ్రేణులు ఉత్సాహంగా ఉండగా.. ఇప్పుడిక కొండా సురేఖ అభ్యర్థిత్వంతో కాంగ్రెస్ జోష్ రెట్టింపు అవుతోంది. ఇక కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని రెండేళ్లుగా రగిలిపోతున్న కొండా దంపతులు ఈ ఎన్నికల్లో తమ సర్వశక్తులూ ఒడ్డి పోరాడటం ఖాయం. కొండాకు రేవంత్రెడ్డి అండాదండా తోడై.. టీఆర్ఎస్, బీజేపీలకు చుక్కులు చూపించడం కూడా ఖాయం..అంటున్నారు.
http://www.teluguone.com/news/content/revanth-reddy-master-plan-huzurabad-ticket-confirm-to-konda-surekha-25-121822.html