30లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరణ.. కేంద్ర మంత్రికి రేవంత్, ఉత్తమ్ వినతి
Publish Date:Apr 17, 2026
Advertisement
యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ధాన్యం యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్కు అనుకూలమని వారు కేంద్ర మంత్రికి తెలిపారు. గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషిని ఆయన నివాసంలో శుక్రవారం (ఏప్రిల్ 17) కలిసిన తెలంగాణ సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించారని గుర్తు చేశారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. 2014-15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని వీరు ఈ సందర్భంగా కోరారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామనిచెప్పారు.
http://www.teluguone.com/news/content/procure-30-lakh-metric-tonnes-of-boiled-rice-36-217589.html





