ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహాలకు కాలం చెల్లినట్లేనా?
Publish Date:Apr 12, 2026
Advertisement
పొలిటికల్ స్ట్రాటజిస్ల్ ప్రశాంత్ కిశోర్ ఎక్కడున్నారు. ఇటీవలి కాలం వరకూ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం జరుగుతున్న కీలక రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఎక్కడా కనిపించకపోవడం, వినిపించకపోవడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ప్రత్యక్షమై.. ఏదో పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పని చేసి.. ఆ పార్టీని గెలుపు బాటలో నడిచే చోదక శక్తిగా తనదైన ముద్ర వేసిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడిలో ఎక్కడా ఉనికిమాత్రంగా కూడా లేకపోవడం గమనార్హం. బీహార్ ఎన్నికల ద్వారా నేరుగా రాజకీయాల్లోకి ప్రవేశించిన కిశోర్.. అక్కడ జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది. ఐదేళ్ల క్రితం తమిళనాడులో డీఎంకేకు, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు పీకే వ్యూహకర్తగా పనిచేశారు. ఆయా పార్టీల విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు మాత్రం డీఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ ఆయనను తమ పార్టీల దరికి కూడా రానీయడంలేదు. మీ సేవలు అవసరం లేదని మర్యాదగా చెప్పేశాయి. తమిళనాట కొత్తగా రాజకీయాలలోకి అడుగుపెట్టిన నటుడు విజయ్ టీవీకే పార్టీకి పీకీ ఎన్నికల వ్యూహాలు అందించే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే విజయ్ కూడా ప్రశాంత్ కిశోర్ వ్యూహ సేవలకు నో చెప్పినట్లు టీవీకే వర్గాల చెబుతున్నాయి. అదలా ఉంటే ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ఐ-ప్యాక్ పై వెల్లువెత్తుతున్న అవినీతి, కుంభకోణాల ఆరోపణలకు కూడా ప్రశాంత్ కిశోర్ మౌనానికి కారణమని అంటున్నారు. ఈ అవినీతి, కుంభకోణం ఆరోపణల కారణంగానే ఆయన కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ తరఫునా ఎన్నికల వ్యూహాలు అందించేందుకు సాహసించలేకపోతున్నారన్నది పరిశీలకులు విశ్లేషణ. చివరాఖరికి తెలంగాణలో కల్వకుంట్ల కవిత కూడా ఎన్నికల వ్యూహాలు అందిస్తానంటూ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఆఫర్ కు నో చెప్పేశారని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ స్ట్రాటజీలకు కాలం చెల్లిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సమాజంలో వర్గాల మధ్య, కులాల మధ్యా విభేదాల ద్వారా రాజకీయ లబ్ధి అన్నదే ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహాలనీ, అవి ఒకసారి ఫలించనినా జనం మరోసారి ఆ వ్యూహాలలో చిక్కుకోరనీ ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల ఫలితాలు నిర్ద్వంద్వంగా రుజువు చేశాయంటున్న రాజకీయ పరిశీలకులు, అందుకే ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశాంత్ కిశోర్ ను వ్యూహకర్తగా నియమించుకోవడానికి సాహసం చేయడం లేదని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/prashant-kishor--political-strategies-become-obsolete-39-217176.html





