పోలవరానికి రీ టెండర్.... కాంట్రాక్ట్ రద్దు !
Publish Date:Jul 10, 2019
Advertisement
ఏపీ ప్రజల జీవనాడిగా చెప్పబడుతోన్న ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజక్టు నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఇప్పటికే చంద్రబాబు సర్కారు హయాంలో ప్రధాన ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అవినీతి, అంచనాల పెంపు, అవకతవకలపై విచారించి నివేదిక ఇవ్వాలంటూ విశ్రాంత ఇంజినీర్లతో కూడిన ఓ కమిటీని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. వీరు తొలుత పోలవరంపై అధ్యయనం చేసి, అన్ని రికార్డులనూ పరిశీలించారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఇంజినీరు ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీరు శ్రీధర్ తదితరులను ప్రశ్నించి, కొన్ని సిఫార్సులు చేస్తూ రిపోర్ట్ ను సిద్ధం చేసింది. సీల్డ్ కవర్ లో ఈ రిపోర్టు నేడు జల వనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందనుంది. అయితే ఈ కమిటీ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులను చేస్తున్న నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ తో ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా మరోసారి టెండర్లను పిలవాలని సిఫార్సు చేసినట్లు విస్వసానీయ వర్గాల సమాచారం. ఇక ఇదే సమయంలో ప్రధాన కాంట్రాక్టర్ తో కాంట్రాక్టు రద్దయితే, సబ్ కాంట్రాక్టులు కూడా రద్దయి పోతాయని, అందువల్ల మొత్తం అన్ని పనులకూ టెండర్లు పిలవాలని కమిటీ తమ నివేదికలో స్పష్టం చేసినట్టు సమాచారం. వాస్తవానికి పోలవరం పనులను అప్పటి కాంగ్రెస్ హయాంలో 2013లో ట్రాన్స్ ట్రాయ్ దక్కించుకుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎల్ అండ్ టీ, బావర్, త్రివేణి, కెల్లర్, బెకం తదితర సంస్థలు సబ్ కాంట్రాక్టర్లుగా చేరాయి. అయితే బాబు సర్కార్ ఏర్పాటు అయ్యాక వేరే వారికీ ఇస్తారని ప్రచారం జరిగినా రాయపాటి చంద్రబాబు పార్టీలోనే చేరడంతో అది జరగలేదు. ఇక బాబు ప్రభుత్వం వచ్చాక ఆపై ప్రాజెక్టు పనుల విషయంలో మార్పులు చోటు చేసుకుని అంచనా వ్యయాలు పెరిగిపోయాయి. మరోపక్క ట్రాన్స్ ట్రాయ్ దివాలా తీయడంతో స్పిల్ వే, కాఫర్ డ్యాం తదితర పనులను ట్రాన్స్ ట్రాయ్ నుండి నవయుగ సంస్థకు అప్పగించారు. ఈ నేపధ్యంలో అధికారికంగా ఆ కమిటీ ఏమి చెప్పనుందా అనేది ఆసక్తికరంగా మారింది.
http://www.teluguone.com/news/content/polavaram-dam-retender-issue-39-87927.html





