నితి ఆయోగ్ ముందు పోలవరం.. బాబు అజెండా ఇదే!
Publish Date:Jul 26, 2024
Advertisement
పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రతి పైసా కేంద్రమే భరించాలి. అలా భరిస్తామని కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవలి తన బడ్జెట్ ప్రసంగంలో విస్పష్టంగా చెప్పారు కూడా. పోలవరం పూర్తికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అయితే పోలవరం కు ఈ బడ్జెట్ లో కేటాయింపు ఎంత అన్నది ఆమె అంకెల్లో చెప్పలేదు. దీంతో పోలవరం పూర్తి అవ్వడానికి ఎంత కావాలి. ఎంత సమయం పడుతుంది అన్న విషయంలో పలు సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరంలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనులను పరుగులెత్తించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, వ్యయం, సమయం వంటి అంశాలపై శనివారం(జులై27) జరిగే నీతి అయోగ్ సమావేశంలోనే చర్చకు తీసుకురావాలని నిర్ణయించారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, పోలవరం ఎత్తు అంశాలపై నీతి అయోగ్ సమావేశంలో లేవనెత్తి పోలవరం విషయంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా సానుకూల వాతావరణం ఏర్పడేలా చేసుకోవాలని బావిస్తున్నారు. పోలవరం ఎత్తుపై తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలను వీటో చేయడానికి నీతి అయోగ్ సమావేశమే సరైన వేదికగా భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ఎత్తుతగ్గించే ప్రశక్తే లేదన్న స్టాండ్ కు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొత్త డయాఫ్రం వాల్ కు బదులుగా రింగ్ ఫెన్సింగ్ నిర్మాణం అంటూ తొలుత విదేశీ నిపుణులు ప్రాథమిక నివేదిక ఇచ్చినా, తరువాత సవరించి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణమే శరణ్యమని పేర్కొన్నారు. ఈ విషయంలో కూడా ఎటువంటి ద్వైదీ భావం లేకుండా కొత్త డయాఫ్రం వాల్ నిర్దుష్ట కాలపరిమితిలో నిర్మించే విషయంలో కూడా నీతి అయోగ్ సమావేశంలో ఒక స్పష్టత వచ్చేలా చంద్రబాబు చర్చించనున్నారు.
http://www.teluguone.com/news/content/polavaram-before-niiti-ayog-25-181557.html