అచ్చుతాపురం సెజ్ లో విషవాయువు లీక్.. 50 మందకి అస్వస్థత
Publish Date:Aug 2, 2022
Advertisement
విశాఖ అచ్యుతాపురం సెజ్లో మళ్లీ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 50 మంది దాకా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ ను పీల్చిన వారంతా వాంతులు, విరేచనాలు చేసుకుని స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితిని గమనించిన కంపెనీ యాజమాన్యం అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రులకు తరలించింది. మంగళవారం అచ్యుతాపురం సెజ్లోని బ్రాండిక్స్ అపెరిల్ సిటీ పరిధిలోని క్వాంటామ్ సీడ్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అవ్వడంతో ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు కంపెనీని మూసేశారు. ఇటీవలే కొన్ని షరతులతో కంపెనీని తెరుచుకోవచ్చని పొల్యూషన్ బోర్డు అధికారులు అనుమతి ఇచ్చారు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే మరోసారి గ్యాస్ లీక్ కావడం కలకలం రేపింది. గ్యాస్ లీక్ సంఘటన జరిగిన సమయంలో దాదాపు 200 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వారిలో 50 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఖ్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కాగా గ్యాస్ లీకేజీ కారణంగా అస్వస్థతకు గురైన వారంతా మహిళా కార్మికులే. గ్యాస్ ఘాటుకు ఎక్కడి వారక్కడే కుప్పకూలిపోయారని చెబుతున్నారు. అస్వస్థతకు గురైన వారిని అచ్యుతాపురం, యలమంచిలి ఆసుపత్రులకు తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. గత జూన్ నెలలో కూడా ఈ కంపెనీ నుంచి రెండు సార్లు విషయావులు లీకయ్యాయని స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ లీకేజీ సంఘటనపై మంత్రి అమర్నాథ్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు మంత్రి
http://www.teluguone.com/news/content/poisinus-gas-leak-in-atchupuram-sez-39-141115.html





