ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ స్టేట్మెంట్
Publish Date:Jun 17, 2026
Advertisement
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ స్టేట్మెంట్ నమోదు.. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు ఆదర్శ్నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మాజీ ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్తో పాటు అరవింద్ యాదవ్ స్టేట్మెంట్లను నమోదు చేశారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఎన్నికలకు రెండేళ్ల ముందే తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ కుటుంబం ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పలు పోరాటాలు నిర్వహించిందని, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపినందుకే తమపై నిఘా పెట్టారని అన్నారు. తాను నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ పార్టీ తరఫున పలు ఉద్యమాలు చేపట్టానని తెలిపారు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ యూత్ కాంగ్రెస్లో క్రియాశీలకంగా ఉండి పలు ఆందోళనల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ కారణంగానే తమ కదలికలపై నిఘా పెట్టినట్లు భావిస్తున్నామని చెప్పారు. తాము ప్రత్యేకంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీసుల వద్ద ఆధారాలు ఉండటంతో సిట్ అధికారులు తమ స్టేట్మెంట్లను నమోదు చేశారని వెల్లడించారు. ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారనే ప్రశ్నకు, తాము చేసిన రాజకీయ పోరాటాలు, ఉద్యమాల కారణంగానే అలా జరిగి ఉండొచ్చని అధికారులకు వివరించినట్లు తెలిపారు. రాజకీయంగా తమను అణగదొక్కేందుకు ఈ చర్యలకు పాల్పడ్డారని అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు.
http://www.teluguone.com/news/content/phone-tapping-case-36-223316.html





