చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై హైకోర్టు సీరియస్
Publish Date:May 1, 2026
Advertisement
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దన్న కోర్టు ఆదేశాల అమలుపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసు, రవాణా శాఖల అధికారులపై వివరణ కోరింది. ఈ కేసులో ప్రతివాదులుగా సీవీ ఆనంద్, శివధర్ రెడ్డి, జోయల్ డేవిస్, లింబాద్రిలతో పాటు హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సీపీ, రవాణా శాఖ కమిషనర్లను పిటిషనర్ చేర్చారు. పెండింగ్ చలాన్లు ఉన్నాయని కారణంగా వాహనాలను సీజ్ చేయొద్దని ఈ ఏడాది జనవరి 20న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చట్టపరమైన విధానాలు పాటించాలని కూడా కోర్టు అప్పట్లో సూచించింది. అయితే ఆదేశాలు ఉన్నప్పటికీ, ఏప్రిల్ 9న మల్లికార్జున అనే వ్యక్తి బైక్ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిని కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనగా పేర్కొంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తరఫున న్యాయవాది విజయ్ గోపాల్ వాదిస్తూ ట్రాఫిక్ పోలీసులు కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని,M-Walletలో RC చూపించినా అంగీకరించడం లేదని, చలాన్లు పెండింగ్లో ఉన్నాయనే కారణంతో వాహనాలు సీజ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన హైకోర్టు, తమ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ చలాన్లు, వాహనాల సీజ్ వ్యవహారంపై కీలక ప్రభావం చూపే అవకాశముందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి
http://www.teluguone.com/news/content/pending-traffic-challans-36-218762.html





