జనసేన మేనిఫెస్టో ఇదే.. జగన్కు మతిపోగొట్టే హామీలు..
Publish Date:Mar 15, 2022
Advertisement
జనసేన ఆవిర్భావ వేదికపై జనసేన మేనిఫెస్టోను ప్రకటించారు పవన్ కల్యాణ్. మేనిఫెస్టో అని పేరు పెట్టకున్నా.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పారు. అందులో పలు ఆసక్తికర హామీలు ఉన్నాయి. సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించి.. జగన్పై విరక్తి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల ఆదరణ చూరగొనే ప్రయత్నం చేశారు. ప్రతీ ఉద్యోగ ఖాళీని భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులనూ ఆకట్టుకున్నారు. తెలంగాణలో దళితబంధు తరహాలో.. ఏపీలో అన్నివర్గాల వెనకబడిన వర్గాల యువతకు తలా 10 లక్షలు ఆర్థిక సాయం చేస్తామంటూ సంచలన పథకం ప్రకటించారు పవన్. ఇక, అమరావతినే రాజధానిగా ఉంటుందంటూ.. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామంటూ.. అధికారంలోకి వస్తే జనసేన ఏం చేస్తుందో చెబుతూ.. అనేక అంశాలను వెల్లడించారు పవన్ కల్యాణ్. ఆయన ఇచ్చిన హామీలు ఆయన మాటల్లోనే..... "ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఎక్కడికి వెళ్లదు. రైతుల మీదపడ్డ ప్రతీ లాఠీదెబ్బ నామీద పడినట్టే. అమరావతి ఇక్కడి నుంచి కదలదు. అలాగని మిగతా ప్రాంతాలను వదిలేస్తామని కాదు. విశాఖను విశ్వనగరంగా, విజయవాడ, తిరుపతిని బలమైన హైటెక్ నగరాలుగా తీర్చిదిద్దుతాం. అమరావతిని అన్ని వర్గాలు, కులాలకు నివాసం కల్పించే అభ్యుదయ రాజధానిగా ముందుకు తీసుకెళ్తాం. కర్నూలు నగరం రుణం తీర్చుకుంటాం. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెడతాం. రాయలసీమ బిడ్డలను గల్ఫ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. జనసేన సౌభాగ్యపదం కింద యువతకు ఒక్కొక్కరికి 10 లక్షల ఆర్ధిక సహాయం చేస్తాం. సంవత్సరానికి లక్ష మంది చొప్పున ఐదేళ్లలో 5 లక్షల మందికి బ్యాంకులో డబ్బు వేస్తాం. బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇస్తాం. ఏపీని అప్పులు లేని రాష్ట్రంగా చేయాలన్నదే నా లక్ష్యం. ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యం. ఇందుకోసం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం తీసుకొస్తాం. ప్రతీ ఉద్యోగ ఖాళీ భర్తీచేస్తాం.. ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్నీ జనసేన అధికారంలోకి రాగానే భర్తీ చేస్తుంది. నిరుద్యోగుల ప్రయోజనాలను కాపాడుతాం. ప్రైవేటు రంగంలో ఏటా 5 లక్షల ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక అమలు చేస్తాం. ఉద్యోగులకు పీఆర్సీ సవరణ చేయిస్తాం. ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా సీపీఎస్ను రద్దుచేయిస్తాం. పాత పెన్షన్ విధానం తీసుకొస్తాం. ఉద్యోగులకు అండగా ఉంటాం. సెక్యులరిజం అంటే ఒక మతానికి ఒక న్యాయం, మరో మతానికి మరో న్యాయం కాదు! మసీదులు, చర్చిలను ప్రభుత్వం కంట్రోల్లో పెట్టుకోదు. కానీ హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఎందుకు? దీనిని మేం పరిశీలిస్తాం. టీటీడీ, ఎండోమెంట్ చట్ట సవరణను పరిశీలిస్తాం. పేదల ఇళ్ల నిర్మాణాలకు, తెల్లకార్డుదారులకు ఉచిత ఇసుక ఇస్తాం. వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మారుస్తాం. మద్దతు ధర, పుడ్ప్రాసెస్, పంట కాలువలు, మినీ రిజర్వాయర్లను ఆధునీకరిస్తాం."
http://www.teluguone.com/news/content/pawan-announced-janasena-manifesto-39-133054.html





