విపక్షాల బలహీనతే బీజేపీ బలం.. ముగిసిన బడ్జెట్ సెషన్..
Publish Date:Apr 7, 2022
Advertisement
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఉభయసభలు షెడ్యూలుకు ఒక రోజు ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిజానికి మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగ వలసిన రెండవ విడత బడ్జెట్ సమావేశాలను, చర్చించవలసిన సమస్యలు ఇంకేమీ లేవన్నట్లు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, ఒక రోజు ముందుగా ఈరోజు (గురువారం) సభ ప్రారంభంలోనే నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రటించారు. రాజ్యసభలో మాత్రం చివరి రోజు కూడా ప్రతిపక్ష సభ్యులు సమస్యలు ప్రస్తావించే ప్రయత్నం చేశారు కానీ, ఫలితం లేక పోయింది. నిరసనల నడుమనే రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, సభను నిరవధికంగా వాయిదా వేశారు. కాగా, రెండు విడతల్లో (జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11నవరకు తొలివిడత, మార్చి 14 నుంచి ఏప్రిల్ 7 వరకు మలి విడత) సుమారు 30 రోజులకు పైగా బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ప్రభుత్వం తనపని తాను చేసుకు పోయింది. బడ్జెట్’తో పాటుగా అనేక కీలక బిల్లులకు సభ ఆమోదం తీసేసుకుని చేతులు కడిగేసుకుంది. మరోవంక విపక్షాలు సర్కార్’ను నిలదీయడంలో విఫల మయ్యాయి. అనైక్యత అనాలో, అసమర్ధత అనాలో అది ఏదైనా విపక్షాల బలహీనతను అధికార కూటమి ఇంచక్కా చక్కగా ఉపయోగించుకుంది. ప్రజస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో, ప్రతిపక్షమూ అంతే అవసరం అని, ప్రధాని మోడీ మొదలు ప్రతి ఒక్కరూ సుద్దులు అయితే చెపుతూనే ఉన్నారు, కానీ పార్లమెంట్’ ఉభయ సభల్లో ఎక్కడా ఆ స్పూర్తి మచ్చుకైనా కనిపించలేదు.అసలే అంతత మాత్రంగా ఉన్న విపక్షాన్ని, మరింత బలహీన పరిచేందుకే అన్నట్లుగా, ‘ఔర్ ఏక్ ధక్కా మారో’ ధోరణిలోనే విపక్షాలను మోడీ, షా జోడీ సర్కార్ ఏ అవకాశం వదులు కోలేదు. ప్రతిపక్షాలు లేవనెత్తిన ఏ అంశం చర్చకు రాకుండా చేయడంలో సార్కర్ సక్సెస్ అయింది. విపక్షాల ప్రయత్నాలన్నీ విఫల మయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా పెట్రోల్,డీజిల్ ధరల పెరుగుదల, ద్రవ్యల్బణంపై చర్చకోసం పట్టు పట్టాయి. అయితే చివరి వరకు కూడా, ఉభయ సభల సభాపతులు ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా, విపక్షాల నోటీసులను తిరస్కరించారు. చెత్తబుట్టకు సమర్పించారు. విపక్షాలు ఓపిక ఉన్నంతవరకు నిరసన తెలిపి,వాకౌట్ చేయడం మినహా ఏమీ చేయలేక పోతున్నాయి. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత అధికార కూటమి ఇక తమకు తిరుగు లేదన్న ధీమాతో ముందుకు సాగుతోంది. ఇందుకు తోడు ఇంతవరకు లోక్ సభలో మాత్రమే సంపూర్ణ మెజారిటీ ఉన్న బీజేపీ, ఇప్పుడు రాజ్యసభలోనూ 30 ఏళ్లలో మొదటి సారిగా,మూడంకెల సంఖ్యను దాటింది. ఈ సంవత్సరం చివరి నాటికీ బీజేపీ పెద్దల సభలోనూ మెజారిటీ మేజిక్ ఫిగర్ చేరుతుంది. ఇప్పుడే, ఇలా ఉంటే ఉభయ సభలో సొంతగా మెజారిటీ సొంతం చేసుకున్న కాషాయ దళం ఇంకెంత దూకుడు పెంచుతుందో వేరే చెప్పనక్కరలేదని, కామన్ సివిల్ కోడ్, (ఉమ్మడి పౌర స్మృతి) జనాభా నియంత్రణ చట్టం వంటి వివాదస్పద చర్యలతో పాటుగా, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణ, లేబర్ కోడ్ల అమలు, ప్రభుత్వ ఆస్తుల నగదీకరణతో పాటు మరిన్ని ఆర్థిక సంస్కరణల విషయంలో మరింత వేగంగా చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయని, విశ్లేషకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/parliament-budget-session-ended-39-134075.html





