అమెరికాలో ‘వన్ చిప్ ఛాలెంజ్’ మెంటల్!
Publish Date:May 17, 2024
Advertisement
మామూలుగా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు వుంటాయి. కానీ, కొంతమంది అనంతకోటి దరిద్రాల కోసం శతకోటి ఉపాయాలను ఆలోచిస్తారు. ఈ జనరేషన్ యూత్ ఇలా ఆలోచించే వాళ్ళలో ముందుంటారు. ముఖ్యంగా అమెరికన్ యూత్ అయితే ఏ మెంటల్ పని చేయడానికైనా రెడీగా వుంటారు. అలా ఇప్పుడు అమెరికన్ కుర్రోళ్ళు చేస్తున్న ఒక మెంటల్ పని ‘వన్ చిప్ ఛాలెంజ్’. అసలేంటీ ‘వన్ చిప్ ఛాలెంజ్’. మన టీవీ షోలలో అప్పుడప్పుడు మిరపకాయలను తినే పోటీలు వుంటాయి చూశారా అలాంటి పోటీనే. కాకపోతే మిరపకాయల కంటే ఎన్నోరెట్లు ఎక్కువ ఘాటు వున్న చిప్ తినే పోటీ. పాఖీ అనే చిప్స్ తయారు చేసే సంస్థ అత్యంత ఘాటుగా వుండే పదార్థాలతో ఒక చిప్ తయారు చేస్తూ వుంటుంది. దాన్ని శవపేటిక ఆకారంలో వుంటే ఒక ప్యాక్లో వుంచుతుంది. ఈ సంస్థ అమెరికన్ యూత్కి ఒక ఛాలెంజ్ చేసింది. తమ చిప్ని తింటూ వీడియో చేయాలి. తమ చిప్ తిన్న తర్వాత నీళ్ళు తాగకుండా, పంచదార లాంటి ఏ పదార్థాలూ తినకుండా ఐదు క్షణాలు వుండగలగాలి. ఇదీ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో పాల్గొన్నవాళ్ళని నోరు మండిపోవడం తప్ప వచ్చేదీ చచ్చేదీ ఏమీ వుండదు. అయినప్పటికీ అమెరికన్ వెర్రి యూత్ ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేస్తూ వుంటారు. తమ ఫోన్లలో వీడియో కెమెరా ఆన్ చేసుకుని, బ్యాక్ గ్రౌండ్లో కౌంట్ డౌన్ టైమర్ పెట్టుకుని చిప్ తింటూ వుంటారు. ఐదు క్షణాలు కౌంట్ డౌన్ అయ్యే వరకూ ఆ చిప్ ధాటికి కుయ్యో మొర్రో అంటారు. ఐదు క్షణాలు దాటిన తర్వాత ఏదో ప్రపంచాన్ని జయించినట్టు ఎక్స్.ప్రెషన్ ఇస్తారు. ఇదీ ఈ ‘వన్ చిప్ ఛాలెంజ్’ వ్యవహారం. ఈ దిక్కుమాలిన ఛాలెంజ్లో కుర్ర సన్నాసులతోపాటు అమెరికాలో వున్న సెలబ్రిటీస్ కూడా పాల్గొనడంలో ఇది బాగా పాపులర్ అయిపో్యింది. వన్ చిప్ ఛాలెంజ్ చేయనివాడు యూత్ కాదన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఈ ఛాలెంజ్ అంత ఈజీగా వుండదు. ఆ దిక్కుమాలిన చిప్ తినగానే నోరు మండిపోతుంది. ఐదు క్షణాలపాటు కూడా భరించలేనంత మండిపోతుంది. ఐదు క్షణాలపాటు అలాగే వున్నవారి సంగతి అలా వుంచితే, చిప్ తినగానే భళ్ళున వాంతులు చేసుకున్నవాళ్ళు, కళ్ళుతిరిగి పడిపోయినవాళ్ళు, నోరు మండిపోయి చాలారోజులు ఏమీ తినలేక తంటాలుపడిన వాళ్ళు కోకొల్లలు. సరే, ఎవరి పిచ్చి వారికి ఆనందం అని ఊరుకోవచ్చు. కానీ, 2023 సెప్టెంబర్లో ఒక ఘోరం జరిగింది. ఈ వన్ చిప్ ఛాలెంజ్లో పాల్గొన్న వొలోబా అనే కుర్రాడు అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రమైన ఘాటు వల్ల అతని గుండెపోటు వచ్చి చనిపోయాడు. దాంతో పాఖీ కంపెనీని అందరూ తిట్టిపోయడంతో ఈ కంపెనీ ఈ ‘వన్ చిప్ ఛాలెంజ్’ని ఉపసంహరించుకుంది. మార్కెట్లో వున్న తమ కంపెనీ చిప్స్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలని ప్రకటించింది. అయితే, ఈ చిప్స్ స్టాక్ని చాలామంది వెనక్కి ఇవ్వలేదు. సీక్రెట్గా అమ్మకాలు జరుగుతూనే వున్నాయి. ‘వన్ చిప్ ఛాలెంజ్’ వీడియోలు వస్తూనే వున్నాయి. ఈ దారుణమైన ఛాలెంజ్ వల్ల ఇంకా ఎంతమంది చనిపోతారో అని అమెరికా పేరెంట్స్ భయపడుతున్నారు. యూత్కి ఈ మెంటల్ ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తున్నారు.
http://www.teluguone.com/news/content/one-chip-challange-39-176193.html