ఓణం పండుగ విశిష్టత ఏంటీ.. పురాణాలు ఏం చెబుతున్నాయి?
Publish Date:Aug 21, 2021
Advertisement
ఓణం దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళలో అతిపెద్ద పండుగ. ఓణం కేరళలోని వ్యవసాయ పండుగ. మలయళీ క్యాలెండరులో మొదటి నెల అయిన చింగంలో (ఆగష్టు – సెప్టెంబర్) వస్తుంది. మహాబలి ఆ ప్రాంతమునకు తిరిగి రావటాన్ని సూచిస్తుంది. శ్రవణా నక్షత్రమును మలయాళమున "తిరువోణము" అంటారు. సింహ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రయుక్త దినమును ఓణం లేక తిరువోణం పేరిట జరుపుకొందురు. ఓణం ఈ పండుగ పదిరోజుల పాటు కొనసాగుతుంది. ఇది కేరళ యొక్క ఆచారములు , సంప్రదాయములు వంటి అనేక అంశములతో ముడిపడి ఉంది. చక్కని పువ్వుల మాలలు , భోజనం , సర్పాకారపు పడవ పందెములు , కైకొట్టికలి నృత్యము మొదలైనవన్నీ ఈ పండుగలో భాగములు. ఈ పండుగ రోజు , ప్రజలు కొత్త దుస్తులు ధరిస్తారు. మగవారు ఒక చొక్కా , ముండు అని పిలవబడే లుంగీ వంటి క్రింది ఆచ్చాదనను , స్త్రీలు ముండు , నరియతు అనబడే ఒక బంగారు పైఆచ్చాదనను ధరిస్తారు. ఆడపిల్లలు పావడ , రవికె ధరిస్తారు. ఓణం ఆధునిక కాలంలో కూడా ఇంకా జరుపుకొనే ఒక ప్రాచీన పండుగ. మలయాళ మాసం చింగంలో వచ్చే కేరళ యొక్క వరికోత పండుగ , వర్షపు పువ్వుల పండుగ , పాతాళం నుండి మావెలి రాజు యొక్క వార్షిక ఆగమనాన్ని వేడుకగా చేసుకుంటాయి. చరిత్ర పూర్వం నుండి కేరళ ప్రజలు మవేలి చక్రవర్తిని పూజించటం మూలంగా ఓణం ప్రత్యేకమైంది. చరిత్ర ప్రకారం , మహాబలి పాలించిన సమయం కేరళకు స్వర్ణ యుగం. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖంగా , సిరిసంపదలతో ఉన్నారు , ఆ దేశ ప్రజలందరూ తమ రాజుని చాలా గౌరవించేవారు. మహాబలికి తన సుగుణములన్నింటితో పాటు ఒక లోపం ఉంది. అతను అహంభావి. అయినప్పటికీ , మహాబలి చేసిన మంచి పనులన్నింటికీ మెచ్చి , తనతో ఎంతో అనుబంధం ఉన్న తన ప్రజలను సంవత్సరానికి ఒకసారి కలుసుకునేటట్లు దేవుడు అతనికి వరమిచ్చాడు. మహాబలి యొక్క ఈ ఆగమనమునే ప్రతి సంవత్సరము ఓణం పండుగగా జరుపుకుంటారు. ప్రజలు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు , తమ ప్రియమైన రాజుకి తాము సంతోషంగా ఉన్నామని చెప్పుకుని అతనికి శుభాభినందనలు తెలియజేస్తారు కేరళ యొక్క ఘనమైన సంస్కృతీ వారసత్వం ఈ పదిరోజుల పండుగ సమయంలో దాని ఉత్తమ రూపుతో , ఆత్మతో బయటకు వస్తుంది. తిరుఓణం నాడు తయారుచేసే ఓణసద్య (ఓణవిందు) అనబడే గొప్ప విందు ఓణ వేడుకలలో అతి గొప్ప భాగం. ఇది 11 నుండి 13 అతి ముఖ్యమైన పదార్ధములతో కూడిన తొమ్మిది రకముల భోజనం. ఓణసద్య అరటి ఆకులలో వడ్డించబడుతుంది , ప్రజలు నేలపైన పరిచిన ఒక చాప పైన కూర్చుని భోజనం చేస్తారు. ఓణంలో ఆకట్టుకునే మరోక ముఖ్య విశేషం వల్లంకలి అనబడే సర్పాకారపు పడవల పందెము , ఇది పంపానదిలో జరుగుతుంది. ప్రేక్షకుల హర్షధ్వానముల మధ్య వందల మంది పడవ నడిపేవారు పాటలు పాడుతూ , అలంకరించబడిన పడవలను నడపటం చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది. ఓణం నాడు ఆటలు ఆడే సాంప్రదాయం కూడా ఉంది , ఈ ఆటలన్నింటినీ కలిపి ఓణకలికల్ అని పిలుస్తారు. పురుషులు తలప్పంతుకలి (బంతితో ఆడేది), అంబెయ్యల్ (విలువిద్య), కుటుకుటు వంటి కష్టతరమైన ఆటలు , కయ్యంకలి , అట్టకలం అని పిలవబడే జగడములలో పాల్గొంటారు. స్త్రీలు సాంస్కృతిక కార్యక్రమములలో మునిగిపోతారు. మహాబలికి స్వాగతం చెప్పటానికి వారు ఇంటి ముంగిట్లో , పువ్వులతో అందమైన రంగవల్లులు దిద్దుతారు. కైకొట్టికలి , తుంబి తుల్లాల్ అనే రెండు రకముల నృత్యములను ఓణం రోజు స్త్రీలు ప్రదర్శిస్తారు. కుమ్మట్టికలి , పులికలి వంటి జానపద ప్రదర్శనలు ఆ వేడుకలకు ఉత్సాహాన్ని జత చేస్తాయి. ఓనక్కోడిగా పిలవబడే ఆ రోజున ధరించే కొత్త దుస్తులు , ఓణం సద్య , అని పిలవబడే విస్తారమైన విందు ఓణం ప్రత్యేకతలు. ఈ విందులో సాధారణంగా అరటి ఆకులపైన అన్నముతో పాటు కనీసం నాలుగు రకముల పదార్ధములు వడ్డించబడతాయి. సాంప్రదాయక ఊరగాయలు , అప్పడములు కూడా వడ్డిస్తారు. పాలు , చక్కెరతో చేసిన 'పాయసం' సాధారణంగా వడ్డించబడుతుంది. దానితో పాటు ఇతర సాంప్రదాయ భారతీయ పిండివంటలు కూడా ఉంటాయి. ఓణం సమయంలో , ప్రజలు వారి ఇంటి ముంగిట్లో రంగురంగుల పువ్వులతో రంగవల్లులు అలంకరిస్తారు , దీనిని పూక్కలం అంటారు. చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలకు పువ్వులను సేకరించి వాటిని పెద్ద పెద్ద ఆకృతులలో అలంకరించే పని అప్పగించబడుతుంది. ఈ పూల ఆకృతులను తయారుచేయటానికి ఓణం రోజు పోటీలు జరుగుతాయి. ఇది సాధారణంగా 1.5 మీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటాయి. ఈ ఆకృతిలో భాగంగా సాధారణంగా ఒక దీపం ఉంచుతారు. ఇటీవలి కాలంలో , ఈ పువ్వుల ఆకృతులు సాంప్రదాయక వృత్తాకారముల నుండి కేరళ ప్రజల జీవితాల యొక్క సాంస్కృతిక , సామాజిక విషయములను ప్రతిబింబిస్తూ విలక్షణమైన ఆకృతులుగా పరిణామం చెందాయి. వల్లంకలి (సర్పాకార పడవ పందెము) ఓణం సమయంలో జరిగే మరియొక ముఖ్యమైన కార్యక్రమం. వీటిలో అరంముల బోటు రేసు , నెహ్రూ ట్రోఫీ బోటు రేసు ప్రముఖమైనవి. దాదాపు 100 మంది పడవవాండ్లు అతి పెద్దవి , అందమైన సర్పాకార పడవలు నడుపుతూ ఉంటారు , ఆ నీటిపైన పయనించే సర్పాకార పడవలను వీక్షించటానికి సమీప ప్రాంతముల నుండి , దూర ప్రాంతముల నుండి స్త్రీలు , పురుషులు వస్తారు. వినాయక చవితి పండుగ సమయంలో హిందువులు గణేశుని బొమ్మలను ప్రతిష్ఠించినట్లుగా ఓణం సమయంలో , కేరళలోని హిందువులు త్రిక్కకర అప్పన్ (వామనుని రూపంలో ఉన్న విష్ణువు) మూర్తిని తమ ఇళ్ళలో ప్రతిష్ఠిస్తారు. కేరళలో ఉన్న అన్ని వర్గముల వారు ఈ పండుగ జరుపుకోవటంతో ఈ పండుగకు మరింత ప్రాధాన్యత వచ్చింది. ఓణం పండుగ హిందూమతం నుండి ఉద్భవించి దానితో సంబంధం కలిగి ఉన్నప్పటికీ , ఈనాడు ఈ పండుగను హిందువులు , ముస్లిములు , క్రైస్తవులు సమానమైన ఉత్సాహముతో జరుపుకుంటున్నారు. ఈ వేడుక సమయంలో కేరళలోని హిందూ దేవాలయములలో అనేక దీపములు వెలిగించబడతాయి. దేవాలయముల ఎదుట ఒక తాటి చెట్టును నిలబెట్టి దాని చుట్టూ కొయ్య దుంగలను నిలబెట్టి ఎండు తాటి ఆకులతో కప్పుతారు. త్యాగము చేసి మహాబలి నరకమునకు వెళ్ళిన దానికి గుర్తుగా ఒక కాగడాతో దీనిని వెలిగించి బూడిద చేస్తారు.
http://www.teluguone.com/news/content/onam-fesitival-special-kerala-celebrate-25-121805.html