జోగి రమేష్ ఏ మాత్రం క్రెడిబులిటీ లేని వ్యక్తి.!
Publish Date:Jul 29, 2026
Advertisement
తెలుగువన్ ప్రత్యేకం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైఖరి, రాజధాని అమరావతిపై ఆయన తీసుకున్న నిర్ణయాలపై మైలవరం తెలుగుదేశం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు వన్ న్యస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కుట్రలతో అమరావతిని చెడగొట్టాలని చూసేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. గతంలో వైపీపీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ వివరంగా వెల్లడించారు. ఆ పార్టీలో ఉండలేని పరిస్థితులు తలెత్తడం వల్లే తాను బయటకు వచ్చి, తన మద్దతుదారులు, శ్రేయోభిలాషుల సూచనల మేరకు తెలుగుదేశం పార్టీలో చేరానన్నారు. పారిశ్రామిక రంగానికి రావాల్సిన రాయితీలు, నిధుల విడుదల విషయంలో నాలుగేళ్లపాటు జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో తమకు కావలసిన కొందరికే నిధులు, రాయితీలు విడుదల చేశారన్నారు. ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను సైతం జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని, మూడు నెలల కాలపరిమితి పేరుతో ఏళ్ల తరబడి కాలయాపన చేస్తూ మోసం చేశారని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అంశంపై జగన్మోహన్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే వసంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని దెబ్బతీసేందుకు జగన్ తెరపైకి తెచ్చిన ప్రతిపాదనలు, ఆలోచనలు జుగుప్సాకరంగా ఉన్నాయని విమర్శించారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించే కుట్రలతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నించారని ధ్వజమెత్తారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధాని. జగన్ కాదు.. ఎవరు దిగివచ్చినా అమరావతిని మార్చడం సాధ్యపడే విషయం కాదని స్పష్టం చేశారు. ఒక నగరం అభివృద్ధి చెందే క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారని, దానిని సహించలేక కుల రాజకీయాలు, ప్రాంతీయ విభేదాలు రగల్చడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బోగస్ హామీలు, రాజకీయ నాటకాలడే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేవారు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినట్లేనని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. రాబోయే రోజుల్లో ఓటు అనేది కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తును నిర్మించే కీలక నిర్ణయమని పిలుపునిచ్చారు. తాను ప్రాతినిధ్యం వహించే ప్రతి వేదికపైనా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని వసంత కృష్ణప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల విధానాలను ప్రజలు ఇప్పటికే గ్రహించారని, ఇకపై అభివృద్ధి నిరోధక రాజకీయాలకు ఏపీలో తావులేదని పునరుద్ఘాటించారు. Vasantha Krishna Prasad Interview, Mylavaram MLA Vasantha, YS Jagan Amaravati Comments, Jogi Ramesh Vasantha Krishna Prasad
http://www.teluguone.com/news/content/ogi-ramesh-has-no-credibility-25-227488.html




