ఫ్రీ వాక్సిన్ ప్లీజ్.. కేంద్రానికి రాష్ట్రాల అభ్యర్ధన
Publish Date:Jun 5, 2021
Advertisement
కరోనా సెకండ్ వేవ్ కొంత సర్దుమనిగింది. దేశంలో కొత్తగా నమోదవుతున్నరోజు వారీ కేసుల సంఖ్య తగ్గుతోంది. మరణాలు కొంత నెమ్మదించాయి. రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. క్రియాశీల కేసులు ఆరు శాతానికి దిగివచ్చాయి. ఇదొక శుభ పరిణామం. కొంత ఊరట ఇచ్చే విషయం. అయితే, అదే సమయంలో వాక్సిన్ విషయంలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సయోధ్యత, సహకారం అవగాహన, ఉండవలసిన విధంగా ఉన్నట్లు కనిపించడం లేదు.ఒక విధంగా చూస్తే, ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ , రాజకీయ పార్టీలు, ‘దయ్యమా నీ పేరు రాజకీకీయం’ (Devil thy name is politics) అన్న నానుడిని గుర్తుకు తెస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ విబేధాల కారణంగా ఒక విధమైన యుద్ద వాతావరణం నెలకొంది. మరో వంక న్యాయస్థానాలు, ప్రభుత్వాలను అంకుశంతో పొడుస్తున్నాయి. మరో వంక, అప్పులు చేసైనా, సంక్షేమం పథకాలు అమలు చేస్తామని చెప్పే ఆంధ్రప్రదేశ్ సహా, పలు రాష్ట్ర ప్రభుత్వాలు, టీకాల విషయంలో మాత్రం కేంద్రం ముందు చేతులు చాస్తున్నాయి. టీకాల ఖర్చు మొత్తానికి మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే భరించాలని, కేంద్రానికి విన్నవించు కుంటున్నాయి.ఈ విషయంలో దేశంలో మిగిలిన ఏకైక కమ్యూనిస్ట్ రాష్ట్రం కేరళ ముందుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఉచితంగా టీకాలు పంపిణీ చేయాలని, ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకంగా ఏకగ్రీవ తీర్మానమేచేసింది. రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ప్రవేశ పెట్టిన తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ సభ్యులు మద్దతు తెలిపారు. అలాగే, సకాలంలో టీకాల పంపిణీ జరగాలని కూడా కేరళ అసెంబ్లీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినాయకురాలు,మమతా బెనర్జీ మరో అడుగు ముందు కేశారు. ఆమె తమదైన స్టైల్లో, ఈ సంవత్సరం అంతానికి దేశంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా వేస్తామని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన మాటను, ఆమె అదంతా బూటకం, డిసెంబర్ ఎండింగ్ నాటికి అందరికీ వాక్సిన్ అయ్యేపనికాదని, అంటున్నారు. మరో వంక మమతా దీదీ, రాష్ట్రాలకు కేంద్రమే ఉచితంగా టీకాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నిజమే, ఇప్పుడు కరోనా టీకా ప్రతి ఒక్కరికీ అవసరం. అది కూడా వేగంగా జరగవలసిన అవసరం కాదనలేనిది. సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదు.. మరో వంక థర్డ్ వేవ్, తలుపులు తడుతోంది. ఇలాంటి పరిస్థితిలో , టీకాకు అన్నిటికంటే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం వుంది. అయితే, ఈ విషయంలో రాజకీయ డిమాండ్లు చేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం తప్పు మాత్రమే కాదు , నేరం ... మహాపరాధం.నిజానికి అనేక సంస్థలు తమ ఉద్యోగులకు టీకాలు ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నాయి. అలాగే స్వచ్చంద సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి.అదే విధంగా ఇంకా అనేక విధాల సహాయం అందుతోంది. నిజానికి ఇప్పుడు కావలసింది ‘టీకా’ /వాక్సిన్. మార్కెట్’లో లభ్యమైతే కొనుక్కుని తీసుకునేందుకు ఆర్థిక స్థోమతగల ప్రజలు సిద్దంగానే ఉన్నారు. సో.. రాజకీయ పార్టీలు, ఇతర బాధ్యతాయుత వ్యవస్థలు అనవసర గందరగోళం సృష్టించడం కంటే ... ప్రజల్లో భరోసా పెంచడం మానవత్వం, మనిషితనం అనిపించుకుంటుంది.
మరో వంక అస్తవ్యస్థంగా మొదలైన టీకాల కార్యక్రమం (వాక్సినేషన్) మెల్లిమెల్లిగా గాడిన పడుతోంది. దేశంలో తయారవుతున్న వాక్సిన్లతో పాటుగా అందుబాటులో ఉన్న మేరకు విదేశాల నుంచి వాక్సిన్ దిగుమతి చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కూడా కొవిడ్ ఫ్రంట్’లో స్వాగతించదగిన పరిణామం.
దేశంలోని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కళ్లకూ ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందజేయాలని ఆశిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం గత సోమవారం తెలియజేసింది. కానీ, కేంద్రం, రాష్ట్రాలు, ప్రయివేట్ ఆస్పత్రులకు వేర్వేరు ధరలకు టీకాలు అమ్మకంపై సుప్రీం కోర్టు సందేహలు వ్యక్తం చేసింది. సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ వంటి దేశీయ సంస్థలు ఉత్పత్తి చేసిన టీకాలను దేశంలోని అర్హులైన మొత్తం ప్రజలకు డిసెంబరు చివరినాటికి ఉచితంగానే అందజేస్తామని సొలిసిటర్ జనరల్ తుషాప్ మెహతా తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
http://www.teluguone.com/news/content/no-free-vaccine-central-government-declared-25-116949.html