కమల దళంలో కొత్త చిచ్చు ... పాత కొత్త నేతల మధ్య వార్..
Publish Date:May 17, 2022
Advertisement
కాంగ్రెస్ అంత కాదు గానీ, బీజేపీలోనూ గ్రూపులున్నాయి. నాయకుల మధ్య ఇగో సమస్యలున్నాయి. బీజేపీలో పుట్టి పెరిగిన వారి విషయం ఎలా ఉన్నా, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి, పార్టీ పోకడలు నచ్చడం లేదన్నది, బహిరంగ రహస్యం. ఇప్పటికే ఒక రిద్దరు నాయకులు ముఖ్యంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు వంటి వారు బయటపడి పోయారు. తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. అలాగే, మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం అసంతృప్తితో రగిలి పోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈటల ఆయన అనుచరులు ఆ వార్తలను ఖండిస్తునారు.ఈటల పార్టీలో చేరకముందే అన్ని కోణాల్లో ఆలోచన చేసి, మంచి చెడులను బేరీజు వేసుకున్న తర్వాతనే అంతిమ నిర్ణయం తీసుకున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. అదీ గాక, ఈటలకు రాష్ట్ర నాయకత్వంతో స్వల్ప విబేధాలున్నా పార్టీ జాతీయ నాయకత్వం ఆయనకు ఎత్తు పీట వేసి గౌరవిస్తోందని అయన వర్గీయులు చెపుతున్నారు. అందుకే ఇప్పటికే పార్టీలో చేరిన వారిలో కొందరు, అబ్బే లాభం లేదు. కమలంలో కొనసాగడం కష్టమని, గుడ్ బై చెప్పి వెళ్లి పోయారు. ఇలా వెళ్లి పోయిన వారిలో మాజీ మంత్రులు నాగం జనార్ధన రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, పెద్ది రెడ్డి మొదలు నిన్న మొన్న ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన తీన్మార్ మల్లన్న వరకు చాలా పెద్ద జాబితానే వుంది.అదే విధంగా ఇతర పార్టీల నుంచి వచ్చి పార్టీలో నిలదొక్కుకున్న నాయకులకు కొదవలేదు. మాజీ మంత్రి డీకే అరుణ మొదలు మాజీ మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు. అదలా ఉంటే ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పాద యాత్ర ముగింపు సభలో పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బండిపై కురిపించిన ప్రశంసలు, అదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఫోన్ చేసి మరీ బండి సంజయ్’ని మెచ్చుకోవడంతో పార్టీ నాయకుల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు, ఉక్కపోత కథలు మరో మారు చర్చకు వచ్చాయి. అయితే దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు మంత్రులే కాదు, ముఖ్యమంత్రులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో పాత కాపులు, కొత్త నేతల మధ్య విబేధాలను కూడా అదే కోణంలో చూడాలని అంటున్నారు. బండి సంజయ్ పాదయాత్ర చేశారు, పార్టీ బండి యాత్రను, ముగింపు సభను సక్సెస్ చేసింది. సో... మోడీ, షా బండి సంజయ్’ను అభినందించారు అంటే అది పార్టీ రాష్ట్ర శాఖను అభినందించినట్లే నని, అయితే మీడియాలో ఒక వర్గం కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తోందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.అలాగని, పార్టీలో అంతా బాగుందా అంటే, లేదు, కమల దళంలోనూ పాలక పక్షాలలో ఉండే, అవలక్షణాలు అన్నీ ఉన్నాయనే అంటున్నారు.
అదలా ఉంటే, ఇతర పార్టీలలో ఎదిగొచ్చిన నాయకులకు, కకమలం పార్టీ కల్చర్’కు అలవాటు పడేవరకు ఉక్కపోత తప్పదని, పార్టీలో చేరి నిలతొక్కుకున్న సీనియర్ నాయకులు అంటున్నారు. ఉక్కపోతను తట్టుకున్నవారే పార్టీలో కొనసాగుతారని లేని వారు, వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లి పోతారని, పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూసే సీనియర్ నేత ఒకరు, చెప్పు కొచ్చారు.
అయితే, ఇతర విధానాల విషయం ఎలా ఉన్నా ఫిరాయింపుల పాలసీ విషయంలో బీజేపీకి క్లారిటీ ఉందని, ఏ పార్టీలోంచి ఎవరు వచ్చినా వద్దనకుండా స్వాగతం పలుకుతుంది.అయితే, పార్టీలో చేరిన తర్వాతనే అసలు కథ మొదలవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి రాజకీయ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అంత త్వరగా గర్భగుడి ప్రవేశం లభించదు.
http://www.teluguone.com/news/content/new-crisis-in-bjp-differences-between-old-amd-new-leaders-39-135996.html





