సైబర్ ఫ్రాడ్కు హీరో నాగార్జున కూడా బాధితుడే : డీజీపీ సీ.వీ. ఆనంద్
Publish Date:Aug 14, 2026
Advertisement
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ‘సురక్ష కా తిరంగా’ ప్రత్యేక సైబర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా SPARK క్లబ్ విద్యార్థుల ప్రతినిధులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో నాగార్జున తనకు ఎదురైన సైబర్ మోసం అనుభవాన్ని పంచుకున్నారు. తాను కూడా నాలుగేళ్ల క్రితం సైబర్ ఫ్రాడ్కు గురైనట్లు తెలిపారు. బ్యాంక్ అధికారి పేరుతో తనకు ఫోన్ వచ్చిందని చెప్పారు. ‘మీరు బిజినెస్లో చాలా స్మార్ట్ అని విన్నాను.. మరి ఎందుకు ఇన్వెస్ట్ చేయడం లేదు? చాలా గొప్ప లాభాలు వచ్చే స్కీమ్ ఉంది’ అంటూ నమ్మించి తనను మోసం చేశారని వివరించారు. సాధారణంగా తన ఆర్థిక వ్యవహారాలన్నింటినీ తన మేనేజర్ చూసుకుంటారని.. అయితే నేరుగా తనకే ఫోన్ రావడంతో అది నిజమైన కాల్ అని నమ్మానని నాగార్జున తెలిపారు. ఈ ఘటన తనకు సైబర్ నేరాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నేర్పిందన్నారు. తన బంధువు ఒకరు షూటింగ్ కోసం ఇరాన్ వెళ్లిన సమయంలో ఎదురైన మరో సైబర్ మోసం ప్రయత్నాన్ని కూడా నాగార్జున వివరించారు. విమానాశ్రయంలో దిగిన కొన్ని నిమిషాలకే ఆమెకు ఫోన్ చేసి.. ‘మేము పోలీసులం.. మీ బ్యాగేజీలో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి’ అంటూ సైబర్ నేరగాళ్లు బెదిరించారని చెప్పారు. గది నుంచి బయటకు రావద్దని, వీడియో కాల్లోనే ఉండాలని సూచించారని తెలిపారు. అయితే తన బంధువుకు సైబర్ మోసాలపై అవగాహన ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించిందని నాగార్జున చెప్పారు. ఆ విషయాన్ని తనకు ఫోన్ చేసి చెప్పిందని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా బాధితులు: డీజీపీ CV ఆనంద్..! తెలంగాణ డీజీపీ CV ఆనంద్ మాట్లాడుతూ.. సైబర్ నేరాల బారినపడుతున్న వారిలో రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. అందుకే ‘సురక్ష కా తిరంగా’ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ను భాగస్వామ్యం చేసి వారికి సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కాలానుగుణంగా నేరాల స్వరూపం మారుతోందని డీజీపీ తెలిపారు. కొన్నేళ్ల క్రితం వరకు భౌతిక దోపిడీలు ఎక్కువగా ఉండేవని.. ప్రస్తుతం నార్కోటిక్, సైబర్ నేరాలు పెరుగుతున్నాయని చెప్పారు. నార్కోటిక్స్కు బానిసలై విద్యార్థులు, యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేరాలకు గురైన బాధితులు ఫిర్యాదు చేసేందుకు కూడా వెనకాడుతున్నారని CV ఆనంద్ తెలిపారు. ‘ఎవరు ఏమనుకుంటారో’ అనే భయంతో చాలామంది తమకు జరిగిన మోసాన్ని బయటకు చెప్పుకోవడం లేదన్నారు. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలంగాణలో సుమారు 40 రకాల సైబర్ నేరాలను గుర్తించామని డీజీపీ తెలిపారు. వీటిలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. పోలీసులు సైబర్ నేరాలను అడ్డుకునేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను నేర్చుకుని, తమ విధానాలను అప్డేట్ చేసుకుంటున్నారని వెల్లడించారు. అప్రమత్తంగా ఉండండి.. సురక్షితంగా ఉండండి..! సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరసత్వంపై అవగాహన కల్పించడం ‘సురక్ష కా తిరంగా’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ‘Stay Alert • Stay Aware • Stay Safe & Secure’ అనే నినాదంతో ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని కాల్స్, పెట్టుబడుల పేరుతో వచ్చే ఆఫర్లు, పోలీసుల పేరుతో వచ్చే బెదిరింపు కాల్స్, అనుమానాస్పద లింకులు, వీడియో కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Nagarjuna Cyber Fraud, Nagarjuna Cyber Scam, Nagarjuna Cyber Crime, Hero Nagarjuna, Cyber Crime, Cyber Fraud, Cyber Scams, Telangana Cyber Security Bureau, Suraksha Ka Tiranga, Cyber Awareness, DGP CV Anand
http://www.teluguone.com/news/content/nagarjuna-cyber-fraud-36-228919.html





