జాతికి మోడీ అబద్ధాలు చెప్పారు.. ఖర్గే
Publish Date:Apr 18, 2026
Advertisement
మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని ప్రసంగం పూర్తిగా నిరాశాజనకంగా ఉందని, ఆ ప్రసంగంలో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు. ఒక అధికారిక ప్రసంగాన్ని మోదీ రాజకీయ ప్రసంగంగా మార్చేశారని.. ప్రత్యర్థులపై బురద జల్లడమే లక్ష్యంగా ఆయన మాటలు ఉన్నాయని ఖర్గే దుమ్మెత్తిపోశారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి నిజంగా ఉంటే, 2023లోనే ఆమోదం పొందిన చట్టాన్ని ప్రస్తుతమున్న 543 లోక్సభ స్థానాల్లోనే అమలు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. దాన్ని నియోజకవర్గాల పునర్విభజన తో ముడిపెట్టడం మహిళా లోకాన్ని మోసం చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని తన ప్రసంగంలో మహిళల సంక్షేమం గురించి కాకుండా, కాంగ్రెస్ ను విమర్శించడానికి ఎక్కువ సమయం కేటాయించారన్న ఖర్గే.. మోడీ ప్రసంగంలో కాంగ్రెస్ పేరును 59 సార్లు ప్రస్తావించారని చెప్పారు. మహిళల గురించి మాట్లాడింది చాలా తక్కువ అని చెప్పారు. దీన్ని బట్టి ప్రధానికి మహిళల అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని అవగతమౌతోందన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటూ విపక్షాలపై ప్రధాని విమర్శలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఖర్గే పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లుతో కలిపి ప్రచారం చేయడం ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూసిందన్నారు. మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఖర్గే ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
http://www.teluguone.com/news/content/modi-lied-to-the-nation-39-217710.html





