తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ప్రమాణ స్వీకారం
Publish Date:Apr 29, 2026
Advertisement
తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం (ఏప్రిల్ 29)న ఘనంగా జరిగింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నూతనంగా ఎంపికైన నాయకులందరూ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు. నూతన కార్యవర్గంలో మొత్తం 29 మందికి పొలిట్బ్యూరోలో స్థానం కల్పించగా, 18 మందికి జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు, పార్టీ వాణిని బలంగా వినిపించేందుకు 10 మంది జాతీయ అధికార ప్రతినిధులను నియమించారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుండటంతో, కేడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేవలం పదవులు ఇవ్వడమే కాకుండా.. రాబోయే రోజుల్లో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఎలా ఉండాలనే దానిపై ఈ సందర్భంగా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
http://www.teluguone.com/news/content/lokesh-sworn-in-as-telugu-desam-working-president-39-218513.html





