బస్సు ఎక్కడమూ అదృష్టమే.. జగన్ బాదుడుపై లోకేశ్ బాదుడు
Publish Date:Apr 14, 2022
Advertisement
వైసీపీ పాలనలో బస్సు ఎక్కడం కూడా అదృష్టంగా భావించాల్సిన దుస్థితి వచ్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి లాగే అధికారులు సైతం ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ మేరకు ట్విటర్లో తీవ్ర విమర్శలు చేశారు. "యధా సీఎం తధా అధికారులు.. ప్రజల్ని మోసం చెయ్యడంలో నిపుణుడైన జగన్ మోసపు రెడ్డిని ఆర్టీసీ అధికారులు ఆదర్శంగా తీసుకున్నారు. పెంపు స్వల్పమేనని ఛార్జీలు భారీగా పెంచడం దారుణం. కిలోమీటర్ల బట్టి ఛార్జీలు పెంచడం వలన ప్రజలపై పెను భారం పడింది". అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "పల్లెవెలుగులో 5 కి.మీ కు రూ. 5 ఉన్న ఛార్జీని రెండింతలు రూ.10 చేసి సామాన్యుడి నడ్డి విరిచారు. ఆ తరువాత కి.మీ కి 10 పైసల చప్పున కనిష్టంగా రూ.5 నుండి గరిష్టంగా రూ.15 పెంచి ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారు." అని ఫైర్ అయ్యారు. "ఇతర సర్వీసుల్లో కి.మీ.ల చొప్పున కనిష్టంగా రూ.30 నుండి గరిష్టంగా రూ.120 భారం పడనుంది. పాస్ లు, ఏసీ బస్సులో బాదుడుకి అడ్డుఅదుపు లేదు. వైసిపి పాలనలో బస్సు ఎక్కడం కూడా అదృష్టంగా భావించాల్సిన దుస్థితి దాపురించింది". అంటూ మండిపడ్డారు నారా లోకేశ్. ఆర్టీసీని ఉద్ధరిస్తానని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ రెడ్డి చేతులెత్తేసి భారమంతా ప్రజలదే అనడం అన్యాయమని.. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/lokesh-fire-on-rtc-bus-price-hike-39-134389.html





