వివాహబంధంలో ఒక్కటైన జీవిత ఖైదీలు.!.. జైలే కల్యాణ మండపం.!
Publish Date:Jul 23, 2026
Advertisement
వేర్వేరు నేరాలకు పాల్పడి జీవత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి ప్రేమ చిగురించిన జైలే.. వారి కల్యాణానికి వేదికగా మారింది. రాజస్థాన్లోని జోధ్పూర్ నగరం సమీపంలో ఉన్న మండోర్ ఓపెన్ జైలు ప్రాంగణం బుధవారం (జులై 22) కళ్యాణ వేదికగా మారింది. వేర్వేరు హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు, చట్టబద్ధమైన అనుమతులతో వేద మంత్రాల సాక్షిగా ఏడడుగులు నడిచి.. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వివరాలిలా ఉన్నాయి. మూలారామ్, సీమ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన హత్య కేసుల్లో నేరస్తులుగా రుజువై యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. శిక్షా కాలంలో వీరి సత్ప్రవర్తన చూసిన జైలు అధికారులు ఈ ఇద్దరినీ సాధారణ జైలు నుండి మండోర్ ఓపెన్ జైలుకు తరలించింది. ఇక్కడే మూలారామ్, సీమలకు పరిచయం ఏర్పడి, అది స్నేహంగా పెరిగి ప్రేమగా మారింది. జీవితాంతం ఒకరికొకరు బాసటగా నిలవాలని, పెళ్లి బంధంతో ఒక్కటి కావాలని నిర్ణయించుకున్న వారిరువురూ విషయాన్ని జైలు అధికారులకు తెలిపారు. సాధారణ పౌరులలాగా పెళ్లి చేసుకోవడం జైలు శిక్షలో ఉన్న ఖైదీలకు అంత సులువు కాదు. ఇందుకు అనుమతి కావాలి. దీంతో జైలు అధికారుల సూచన మేరకు వీరిద్దరూ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఖైదీల పునరావాసం, వారి ప్రాథమిక హక్కులు, మరియు జైలులో వారు కనబరిచిన సత్ప్రవర్తనను పరిగణనలోనికి తీసుకున్న రాజస్థాన్ హైకోర్టు.. మూలారామ్, సీమల విజ్ణప్తిపై సానుకూలంగా స్పందించింది వివాహానికి అనుమతి ఇవ్వడమే కాకుండా, . వివాహం చేసుకోవడానికి పెరోల్ కూడా మంజూరు చేసింది. న్యాయస్థానం ఆమోదముద్ర పడటంతో జోధ్పూర్ మండోర్ ఓపెన్ జైలులోనే వీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను జైలు అధికారులు చేశారు. దీంతో బుధవారం(జులై 22) జైలు ప్రాంగణంలోనే సాంప్రదాయబద్ధంగా వీరు వివాహబంధంలో ఒక్కటయ్యారు. వీరి వివాహవేడుకకు ఉన్నతాధికారులు, సిబ్బందితో పాటు పరిమిత సంఖ్యలో బంధువులు, తోటి ఖైదీలు హాజరయ్యారు. Jodhpur open jail wedding, life convicts marriage, Mularam Seema prison love story
http://www.teluguone.com/news/content/lifers-unite-in-matrimony-36-226824.html





