పుణే కేతన్ అగర్వాల్ మృతి కేసులో షాకింగ్ నిజాలు
Publish Date:Jun 24, 2026
Advertisement
బర్త్డే ప్లాన్ వెనుక దాగున్న భారీ కుట్ర.. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పుణే ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ (26) మరణం వెనుక ఊహించని నమ్మకద్రోహం బయటపడింది. మొదట లోహగడ్ కోటపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మరణించాడని భావించిన ఈ కేసు, చివరకు కాబోయే భర్తను అడ్డుతొలగించుకోవడానికి ఒక యువతి ఆడిన క్రూరమైన నాటకమని పోలీసులు తేల్చారు. నిందితురాలైన సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) కలిసి ఈ ఘోరానికి ఒడిగట్టారు. నవంబర్ నెలలో అంగరంగ వైభవంగా జరగాల్సిన వివాహానికి ఇరు కుటుంబాలు ఉదయ్పూర్లో ప్యాలెస్ను కూడా బుక్ చేసుకున్నాయి. కేతన్ తన కాబోయే భార్య సియా రాబోయే పుట్టినరోజు వేడుకల కోసం ఎంతో ఉత్సాహంగా ఏర్పాట్లు చేశాడు. ఇందుకోసం మహాబలేశ్వర్లోని ఓ లగ్జరీ రిసార్ట్లో ఏకంగా 40కి పైగా గదులను కూడా రిజర్వ్ చేశాడు. అంతగా ప్రేమించిన వ్యక్తిని, సియా మాత్రం తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడన్న ఏకైక కారణంతో అత్యంత కిరాతకంగా అంతమొందించింది. జూన్ 18వ తేదీన సియా పుట్టినరోజు ముందస్తు వేడుకల నెపంతో కేతన్ను లోహగడ్ కోటకు రప్పించింది. అక్కడ ఫోటోలు దిగుతున్న తరుణంలో, ఆమె తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్ను దాదాపు 400 అడుగుల లోతైన లోయలోకి తోసేసింది. అంతకుముందు జూన్ 14న కూడా వారు ఇదే కోటపై కేతన్ను నెట్టేయడానికి ప్రయత్నించగా, అతడు పొదలను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పట్లో పామును చూసి భయపడి నీపై పడ్డానని సియా నమ్మబలికి తృటిలో తప్పించుకుంది. ఈ ఘాతుకం అనంతరం సియా ఏమీ ఎరగనట్లు నటిస్తూ.. "నన్ను నా బర్త్డే రోజే ఒంటరిని చేసి వెళ్ళిపోయావు" అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెట్టింది. అయితే, ఘటనా స్థలంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులకు తీవ్రమైన ఎండలో కూడా ముఖాన్ని కవర్ చేస్తూ హుడీ ధరించిన ఒక అనుమానితుడు కనిపించాడు. ఆ హుడీ ధరించిన వ్యక్తి సియా ప్రియుడు చేతన్గా గుర్తించడంతో ఈ మిస్టరీ వీడింది. సియా గోయల్ పూణేకు చెందిన 22 ఏళ్ల చేతన్ బాబులాల్ చౌదరి అనే యువకుడితో గత ఒక సంవత్సర కాలంగా ప్రేమలో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేతన్తో పెళ్లి సియాకు ఇష్టం లేదు, కానీ ఆ విషయాన్ని నేరుగా ఇంట్లో చెప్పలేక కేతన్ను పూర్తిగా తన దారి నుండి తొలగించాలని ఆమె తన ప్రియుడు చేతన్తో కలిసి ఒక భయంకరమైన కుట్ర పన్నింది. కేవలం జనవరి 1 నుండి జూన్ 18 మధ్య ఈ ఆరు నెలల కాలంలోనే సియా, చేతన్ ఇద్దరూ ఏకంగా 2,004 సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారు, వారి మొత్తం సంభాషణల సమయం 238 గంటలుగా తేలింది. కేతన్ను అంతమొందించడానికి వీరు గతంలో కూడా ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. జూన్ మొదటి వారంలో కేతన్, సియా ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం బాలి వెళ్లాల్సి ఉండగా, ముంబై విమానాశ్రయంలో కేతన్ పాస్పోర్ట్ అదృశ్యమైంది. నిజానికి ఆ ట్రిప్ రద్దు కావాలని సియానే కేతన్ పాస్పోర్ట్ను దొంగిలించి దాచిపెట్టింది. అంతకుముందు మే 31న కూడా లోహగఢ్ కోటకు వెళ్ళినప్పుడు సియా అతడిని నెట్టేయడానికి ప్రయత్నించింది, కానీ కేతన్ తృటిలో తప్పించుకోగా, అక్కడ పామును చూసి కాపాడటానికి నెట్టానని అబద్ధం చెప్పి కేతన్ను నమ్మించింది. ఈ ఘోర ఉదంతంపై బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. "పెళ్లి ఇష్టం లేకపోతే నేరుగా చెబితే వివాహం రద్దు చేసుకునేవాళ్లం, అంతేకాని ఇంత దారుణానికి ఒడిగట్టాలా" అంటూ కేతన్ తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. ప్రస్తుతం నిందితులిద్దరినీ లోనావాలా రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు. ఈ కిరాతక ప్రేమికులకు కోర్టు కఠినమైన శిక్ష విధిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ketan-agarwal-murder-case-36-224051.html





