కాంగ్రెస్ విధేయులను విస్మరిస్తున్న రేవంత్ తీరు.. కేసీఆర్ ను దీటుగా ఢీకోనే లక్ష్యం బేజారు!
Publish Date:May 12, 2022
Advertisement
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రాష్ట్ర కాంగ్రెస్ లో అంతకు ముందు లేని జోష్ కనిపిస్తోందని ఆ పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో అంగీకరించేంత మార్పు కనిపించింది. ఆదిలో సీనియర్ల అలకలు, మోహం చాటేయడాలు వంటివి ఉన్నా.. క్రమంగా అవి మరుగున పడి రాష్ట్రంలో తెరాసను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన జవసత్వాలను సంతరించుకుంది. మధ్య మధ్యలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ఒంటెత్తు పోకడలపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేసినా, మీడియాకెక్కి రచ్చ చేసినా పార్టీకి పెద్దగా నష్టం వాటిల్లింది లేదు. పైగా పార్టీ హైకమాండ్ రేవంత్ కు పూర్తి మద్దతుగా నిలబడటంతో.. అంతర్గత విభేదాలు, రేవంత్ వ్యతిరేక నేతలు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన విజయవంతంతో పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అస్త్రశస్త్రాలతో సన్నద్ధం అవుతున్నదని అంతా భావించారు. అయితే పైకి గట్టిగా ఎవరూ మాట్లాడకపోయినా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ లో మాత్రం ఆల్ ఈజ్ వెల్ అనే పరిస్థితి లేదు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ఒంటెత్తు పోకడలు కాంగ్రెస్ కు నష్టం చేకూర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికలలో తెరాసకు ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ ను ప్రజలు గుర్తించారనీ, అయితే మెజారిటీ నియోజకవర్గాలలో రేవంత్ తీరు వల్ల పార్టీకి నష్టం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నయనీ వారు చెబుతున్నారు. మొదటి నుంచీ పార్టీకి విధేయులుగా ఉండి, నియోజకవర్గ స్థాయిలో ప్రజలలో ఆదరణ సంపాదించుకున్న సీనియుర్లను కాదని వారికి పోటీగా వేరేవారిని ప్రోత్సహిస్తుండటం పట్ల పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ గా కొత్త వారికి అవకాశాలివ్వాలన్న ఆయన ఉద్దేశాన్ని తప్పు పట్టలేం కానీ, విధేయులనీ, పార్టీ కోసం పని చేసిన వారినీ పక్కన పెట్టడం వల్ల కేసీఆర్ ను దీటుగా ఎదుర్కొని అధికారంలోకి రావాలన్న పార్టీ లక్ష్యాన్ని సాధించాలంటే మాత్రం రేవంత్ తన వైఖరి మార్చుకోవాలని వారంటున్నారు. క్షేత్ర స్థాయిలో గట్టి పునాదులు ఉన్న పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ముందు నుంచీ పార్టీకి విధేయంగా ఉన్న వారిని అవకాశాలకు గండి కొట్టకుండా, కొత్త వారిని ప్రోత్సహించాలనీ, అలా కాకుండా విధేయులకు నియోజకవర్గంలో పోటీ నాయకత్వాన్ని పెంచి పోషించేలా వ్యవహరిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-ignore-congress-loyals-39-135788.html





