పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భారీ ఆర్థిక సాయం..!
Publish Date:Aug 8, 2026
Advertisement
నర్సంపేట మాజీ శాసనసభ్యులు, దివంగత నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొండంత అండగా నిలిచారు. ఇటీవల అకాల మరణం చెందిన సుదర్శన్ రెడ్డి కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏకంగా రూ. 2.25 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్థిక ప్రాకేజీలో భాగంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు, చదువుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున మొత్తం రూ. 2 కోట్లు కేటాయించనున్నారు. తండ్రి లేని లోటు పిల్లల ఎదుగుదలకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.మరోవైపు సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వయోభారంతో బాధపడుతుండటంతో, ఆమె వైద్యారోగ్య సంరక్షణ మరియు రోజువారీ అవసరాల కోసం రూ. 25 లక్షలను నేరుగా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నారు. వచ్చే వడ్డీతో ఆమె జీవనం సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు మరియు ముఖ్య ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. కేవలం ఆర్థిక సాయంతోనే సరిపెట్టకుండా, ఆ కుటుంబ శ్రేయస్సును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను పార్టీ తీసుకుంటుందని ఆయన ఉద్ఘాటించారు.సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కాలం నుండి పార్టీకి నమ్మకమైన సైనికుడిగా, ప్రజాప్రతినిధిగా అందించిన సేవలను కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కష్టకాలంలో నాయకుల కుటుంబాలకు బాసటగా నిలవడం పార్టీ ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. సుదర్శన్ రెడ్డి దశదిన కర్మల కార్యక్రమాలు పూర్తయిన తర్వాత, జిల్లా స్థాయి సీనియర్ నాయకులు మరోసారి సమావేశమై కుటుంబ సంక్షేమానికి సంబంధించి మరిన్ని సమగ్ర నిర్ణయాలు తీసుకోనున్నారు.కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దివంగత నాయకుడి కుటుంబానికి లభించిన ఈ ఆర్థిక ధీమా వల్ల వారి భవిష్యత్తుకు భరోసా లభించిందని పొలిటికల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. KCR, Peddi Sudarshan Reddy, BRS Party, Telangana News, Peddi Sudarshan Reddy Family Financial Aid, KTR
http://www.teluguone.com/news/content/kcr-36-228390.html





