మునుగోడులో కమలం పార్టీకి ఎదురుగాలి.. అభ్యర్థి తీరే కారణమని బీజేపీ అసహనం
Publish Date:Sep 26, 2022
Advertisement
మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి గండంగా మారిందా? ట్రంప్ కార్డ్ అనుకున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కారణంగానే అక్కడ ఎదురుదెబ్బ తగలనుందా? కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బలాన్ని అతిగా ఊహించుకుని ఉప ఎన్నికకు తెరతీసిన కమలం పార్టీ బొక్కబోర్లా పడనుందా? అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే సమాధానం ఇస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ లా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ను తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలూ తెరాస, కాంగ్రెస్, బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ గెలుపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయానికి రాచబాట అవుతుందని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి, మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి తన వ్యాఖ్యలతో సెల్ఫ్ గోల్ చేసుకోవడంతో బీజేపీ చిక్కుల్లో పడింది. ఆయన వ్యాఖ్యలకు మునుగోడు ఓటర్లు, రైతులు రగిలిపోతున్నారు. ఇక తెరాసకు అయితే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యాఖ్యలు అయితే పదునైన విమర్శనాస్త్రాలు సంధించడానికి ఒక అవకాశంగా అంది వచ్చాయి. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నల్గొండ జిల్లాలో బలమైన నాయకుడు అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ టికెట్ పై ఒక సారి ఎంపీగా, మరో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకీ రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నిక రావడానికి కారణం అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేశాననీ, ఉఫ ఎన్నిక వస్తేనా నియోజకవర్గ అభివృద్ధికి తెరాస సర్కార్ నడుంబిగిస్తుందని ఆయన తన రాజీనామా సందర్భంగా చెప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి తెరాసను దీటుగా ఎదుర్కొనే పరిస్థితి లేదనీ అందుకే బీజేపీ తీర్ధం పుచ్చుకున్నాననీ కూడా చెప్పుకొచ్చారు. సరే బీజేపీలో చేరిన రాజగోపాలరెడ్డి అదే పార్టీ అభ్యర్థిగా మునుగోడు నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెరాస మునుగోడు ఉఫ ఎన్నికలో విజయం సాధించి కమలం స్పీడ్ కు బ్రేక్ వేయాలని, సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉన్నాయి. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాన్ని ఇక్కడా రిపీట్ చేసి రాష్ట్రంలో తమకు తిరుగులేని మద్దతు ఉందని చాటాలని బీజేపీ విశ్వయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చేసిన ఓ వ్యాఖ్య బీజేపీని డిఫెన్స్ లో పడేసింది. అధికార తెరాస మొదటి నుంచీ కూడా తెలంగాణ వ్యవసాయానికి తమ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తోందంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెడితే నష్టమేమిటి? అంటూ చేసిన వ్యాఖ్యలు రైతాంగంలో ఆయన పట్ల, బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. డిస్కంలను కాపాడుకునేందుకు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం తప్పేంటి అంటూ కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా సీన్ సితార అయిపోయిందని పరిశీలకులు అంటున్నారు. ఉచిత కరెంటుకు తాను వ్యతిరేకం కాదంటూనే ఆయన మరో వ్యాఖ్య చేశారు. ఎవరు ఎంత కరెంట్ కాల్చుతున్నరో, ఏ రైతుకు ఎంత సబ్సిడీ వస్తున్నదో తెలుసుకొనేందుకే కేంద్రం మీటర్లు పెడుతామని చెప్పి ఉండవచ్చన్నారు. దీంతో మునుగోడుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఒక్కసారిగా షాక్ తగిలినట్లైంది. ఇప్పటికే మునుగోడు అభ్యర్థిగా రాజగోపాల రెడ్డి ఎంపిక పట్ల బీజేపీ అధిష్ఠానంలో ఒకింత అసంతృప్తి ఉంది. ఇంతన్నాడు అంతన్నాడు చివరికి తనతో పాటు క్యాడర్ ను తెచ్చుకోవడంలో విఫలమయ్యాడన్న అసంతృప్తి ఆ పార్టీ నేతలలో కనిపిస్తోంది. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించడం, అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోను బిజెపి అనూహ్యంగా ఎక్కువ కార్పొరేటర్ లను గెలుచుకోవడంతో మునుగోడు ఉప ఎన్నికల తో పాటు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోను తెలంగాణలో కమలం జెండాయే ఎగురుతుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆఘమేఘాల మీద రాజగోపాలరెడ్డి చేత రాజీనామా చేయించి, కమలం తీర్థం ఇచ్చి మరీ మునుగోడు ఉప ఎన్నికకు తెరలేపింది బీజేపీ. ఆయనకు నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉందనీ, విజయం తథ్యమనీ బీజేపీ విశ్వాసంతో ఉంది. కోమటిరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కమలం తీర్థం పుచ్చుకుంటారని ఆశలు పెట్టుకుంది. అయితే అదేమీ జరగకపోవడంతో మునుగోడులో బీజేపీని గెలిపించుకునేందుకు పెద్ద ఎత్తున కేంద్ర మంత్రులు మునుగోడులో మకాం వేసే ప్లాన్ లో ఉన్నారు. కానీ నియోజకవర్గంలో రాజగోపాలరెడ్డిని జనం ఎక్కడికక్కడ సమస్యలపై నిలదీస్తుండటంతో రాజగోపాలరెడ్డి బలాన్ని ఎక్కువగా ఊహించుకున్నాం అన్న భావన కమలం నేతలలో మొదలైందని అంటున్నారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మోటార్ల విషయంలో చేసిన వ్యాఖ్యలతో కమలం పార్టీ నేతలు తలపట్టుకుంటున్నారట. ఎరక్కపోయి ఉప ఎన్నికకు తెరతీసాం..ఇప్పుడు ఇరుక్కుపోయామా అని మధన పడుతున్నారట. మునుగోడులో ఫలితం కమలం పార్టీకి వ్యతిరేకంగా వస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయంపై ఆశలకు నీళ్లొదిలేసుకోవలసిందేనన్న ఆందోళన బీజేపీ నేతలలో వ్యక్తమౌతోంది. అందుకే నష్ట నివారణ కోసం మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి బలంతో కాకుండా కమలం ఇమేజ్ తో విజయం సాధించేందుకు పావులు కదుపుతోందంటున్నారు. 16 మందితో వ్యూహ కమిటీని ఏర్పాటు చేసి మునుగోడుపై ప్రత్యేక దృష్టి పెట్టిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కోమటిరడ్డి రాజగోపాలరెడ్డికి మునుగోడు ప్రచార బాధ్యతలు అప్పగించకుండా అభ్యర్థిగా మాత్రమే ప్రజల ముందు నిలబెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. మునుగోడులో పార్టీ ప్రచారం సహా అన్నీఆ కమిటీయే చూసుకుంటుందని బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే రాజగోపాలరెడ్డికి విస్పష్టంగా చెప్పేసిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
http://www.teluguone.com/news/content/kamalamparty-tenssion-in-munugodu-39-144442.html