జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ పుకార్లపై క్లారిటీ..!
Publish Date:Jul 13, 2026
Advertisement
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, సినీ వర్గాల్లో ఒకే ఒక్క వార్త విపరీతంగా హల్చల్ చేసింది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈనెల 18వ తేదీన అమరావతి వేదికగా ఒక సంచలన రాజకీయ ప్రకటన చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేశాయి. దాంతో ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై అభిమానులు, రాజకీయ విశ్లేషకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ వార్తలపై ఎన్టీఆర్ ఫాన్స్ అసోసియేషన్ శ్రేణులు తక్షణమే స్పందించి పూర్తి క్లారిటీ ఇచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రకటనకు సంబంధించిన ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వారు తేల్చిచెప్పారు. జూలై 18న జరగబోయే కార్యక్రమం గురించి ఫాన్స్ అసోసియేషన్ ఆసక్తికర వివరాలను వెల్లడించింది. అది పూర్తిగా సేవా దృక్పథంతో కూడినదని, రాజకీయాలకు దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. 'మా ఊరు వాడ' అనే పేరుతో చేపట్టబోయే ఈ వినూత్న సేవా కార్యక్రమాన్ని చాలా కాలం క్రితమే ఎంతో ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేశామని వారు పేర్కొన్నారు. కేవలం సామాజిక సేవే లక్ష్యంగా సాగే ఈ వినూత్న కార్యక్రమానికి రాజకీయ రంగు పూసి చూడవద్దని అభిమాన సంఘాలు కోరాయి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎన్టీఆర్ ఫాన్స్ అసోసియేషన్ తమ అధికారిక వెబ్సైట్ RAWNTR.ORG వేదికగా ఒక సుదీర్ఘ అధికారిక ప్రకటనను విడుదల చేసి పుకార్లకు చెక్ పెట్టింది. అభిమానులు, ప్రజలు ఇటువంటి తప్పుడు ప్రచారాలను అస్సలు నమ్మవద్దని సదరు నోటిఫికేషన్లో విజ్ఞప్తి చేశారు. కేవలం సేవా కార్యక్రమాలపైనే తాము ప్రసుతం పూర్తి దృష్టి పెట్టామని, రాజకీయాలకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు ఇప్పుడు ఉండబోవని ఈ ప్రకటన ద్వారా తేల్చిచెప్పడంతో అభిమానులు శాంతించారు.
http://www.teluguone.com/news/content/junior-ntr-politics-36-225861.html





