ఏపీలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు : సీఎం చంద్రబాబు

Publish Date:Jun 24, 2026

Advertisement

జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి..

రాష్ట్రంలో సువర్ణాధ్యాయం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్సులో బంగారం వెలికితీతతో సీమకు పునర్ వైభవం రానుందని అన్నారు. బుధవారం సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరిలో పర్యటించారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్సులో జియో మైసూర్ - డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

 

 

బంగారం శుద్ధి కోసం బంగారు ఖనిజంతో కూడిన మట్టిన తీసుకెళ్లే భారీ వాహానాలను జెండా ఊపి ప్రారంభించారు. మైనింగ్ జరిగే ప్రాంతంలో భారీ వాహనాలు నడిపేలా సిమ్యులేటర్ యంత్రాలపై మహిళలకు, యువతకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని సీఎం సందర్శించారు. రూ.405 కోట్ల పెట్టుబడితో జొన్నగిరిలో జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు బంగారాన్ని మైనింగ్ చేసి, ప్రాసెస్ చేసి విక్రయించనున్నారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్సులో తొలి ఏడాది 400 కేజీలతో మైనింగ్ ప్రారంభించి తదుపరి దశలో 900 కేజీలు, అనంతరం 2 టన్నుల వరకూ బంగారాన్ని ఉత్పత్తి చేసే ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. జియో మైసూర్ - డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు జొన్నగిరిలో తవ్వకాలు జరిపి ముడి ఖనిజం నుంచి బంగారం ఉత్పత్తి చేసే ప్రక్రియను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు.

 

 

 

ఉత్పత్తి యూనిట్లోని వేర్వేరు విభాగాలను పరిశీలించారు. బంగారు బిస్కట్లు సహా వివిధ రూపాల్లోని తుది ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మైనింగ్ నుంచి తుది ఉత్పత్తి వరకూ జరిగే ప్రక్రియలను జియో మైసూర్ సంస్థ చైర్మన్ ప్రభాకరన్, ఎండీ నవీన్ లాల్ చంద్ర సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...”రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైంది. ఈ సువర్ణ అధ్యాయానికి రతనాల సీమ రాయలసీమ కేంద్రమైంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును లాంఛ్ చేయడం శుభపరిణామం. 

 

 

విస్తరణ యూనిట్ కు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాజెక్ట్ చేపట్టిన సంస్థల యాజమాన్యాలకు, ఉద్యోగులకు, కార్మికులకు అభినందనలు. జొన్నగిరి ఘనత నేటిది కాదు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని సువర్ణగిరి అని పిలిచేవారు. అశోకుడి కాలంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా ఉన్న సువర్ణగిరే ఈనాటి జొన్నగిరి. వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం బంగారం, రత్నాలతో నిండింది. ఇక్కడకు దగ్గరలో లభించిన అశోకుడి ఎర్రగుడి శాసనాలు ఈ ప్రాంత వైభవాన్ని చెబుతున్నాయి. 


రాయలసీమ అంటేనే రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో సీమలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారు. ప్రపంచానికి కోహినూర్ వజ్రాన్ని అందించిన ఘనత మన రాష్ట్రానిదే. కాలక్రమేణా రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితులు తలెత్తాయి. ప్రాజెక్టులు పూర్తి చేసి, సాగునీరు ఇచ్చి సీమకు మళ్లీ జీవం పోశాం. గోల్డ్ మైనింగ్ తో సీమకు పూర్వ వైభవం వస్తుంది. ఈ ప్రాంతానికి జొన్నగిరి బదులు స్వర్ణగిరి అని పేరు పెట్టుకుందాం. 2047కు దేశాన్ని వికసిత్ భారత్ గా తయారు చేయాలన్నది ప్రధాని మోదీ కల. మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తయారు చేయాలన్నది నా ఆశయం.”అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఏపీ అంటే రత్నగర్భ

“ఇక్కడ గోల్డ్ మైన్ వచ్చింది. ఇక్కడి ప్రజల జీవితాలు స్వర్ణమయం కావాలి, ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని స్వర్ణగిరి మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేస్తారు. రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తామని చెప్పిన మాటను నెరవేర్చుకుంటున్నాం. స్వర్ణగిరి గ్రామం నుంచే ఈ ప్రణాళిక ప్రారంభం అయ్యింది. ఇక దేశమంతా స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ గురించే మాట్లాడుతుంది. దేశం ఇప్పుడు 800 కిలోల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. చమురు తర్వాత ఇదే అతిపెద్ద దిగుమతి. బంగారం అంటే మనందరికీ ఎంతో మమకారం. బంగారం ఉంటే మనకు గౌరవంగా భావిస్తాం. తొలి ఏడాది 400 కిలోలు నుంచి ప్రారంభించి 50 మెట్రిక్ టన్నుల బంగారం ఉత్పత్తికి చేరుకుంటాం. ఏటా ఉత్పత్తి అయ్యే బంగారంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మొత్తంలో కొంత మేరైనా తగ్గుతుంది. దీంతో విదేశీ మారక నిల్వల్ని కొంత కాపాడుకోవచ్చు. 

స్థానిక యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా వస్తాయి. ఈ గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ ఈ ప్రాంత అభివృద్దికి ఒక గ్రోత్ ఇంజిన్ అవుతుంది. బంగారం ఎక్కడికో తరలించి ఆభరణాలు తయారు చేసే బదులు ఇక్కడే ఓ జ్యుయలరీ పార్కు కూడా ఏర్పాటు చేస్తాం. ఈ పరిశ్రమకు అనుమతులు, భద్రత కూడా కల్పిస్తాం. స్వర్ణగిరి నుంచి ఎయిర్ పోర్టుకు హెలికాప్టర్ ద్వారా బంగారం తరలించే ప్రాజెక్టు చేపడతాం. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ మాత్రమే కాదు...ఆంధ్రప్రదేశ్ అంటే రత్నగర్భ. మన రాష్ట్రంలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు. మంగంపేట బెరైటీస్, కడప లైమ్ స్టోన్, యురేనియం, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఉంది. చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్, కుప్పంలో గ్రీన్ గ్రానైట్, శ్రీకాకుళంలో బ్లూ గ్రానైట్. గూడూరు మైకా, నెల్లూరు సిలికా, ఉత్తరాంధ్ర తీరంలో బీచ్ శాండ్. అనంతపురం, కడపలో ఐరన్ ఓర్.... కేజీ బేసిన్ లో గ్యాస్, పెట్రోల్ లభ్యమవుతాయిని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది.
పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం..
హైదరాబాద్‌లో కల్తీ, నాసిరకం ఆహార ఉత్పత్తుల తయారీపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
ఈ నెల 22 వ తేదీ ఉదయం భూపాలపల్లి RTO ఆఫీస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించిన జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మృతిపై విచారణ
తుంగభద్ర నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి
మహారాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని వరుణుడు వణికించాడు.
ఏపీలో మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
బర్త్‌డే ప్లాన్ వెనుక దాగున్న భారీ కుట్ర..
డిగ్రీ లేకుండానే ఏఐతో అద్భుతాలు సృష్టిస్తున్న ఆయుష్ సింగ్..
తమిళనాడు సీఎం విజయ్ ఉదారత..
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలో ఒక ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది.
చంచల్‌గూడ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి విమర్శల పర్వం ఊపందుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.