మళ్లీ మాట తప్పి, మడమ తిప్పిన జగన్.. వాలంటీర్ల జీవితాలు చిందరవందరే!
Publish Date:May 11, 2022
Advertisement
మాట తప్పను..మడమ తిప్పను అంటూ గోప్పగా చెప్పుకునే ఏపీ సీఎం.. వరుసగా మాట తప్పుతున్నారు. మడమ తిప్పుతున్నారు. ఏపీ రాజధాని అమరావతే అన్న వాగ్దానం నుంచి ఈ మూడేళ్ల కాలంలో ఆయన మాట తిప్పని, మడమ తిప్పని సందర్భం ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఎన్నికలకు ముందు, పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు చేస్తున్నట్లే కనిపిస్తూ.. ప్రతి పథకంలోనూ కోతలు విధిస్తూ వచ్చారు. వృద్ధాప్య పింఛన్ల విషయంలోనూ ఆయన మాట తిప్పి మడమ తిప్పి తాతా అవ్వలను నిలువునా మోసం చేశారు. ఇలా ఏ విషయం చూసుకున్నా చెప్పేదొకటి.. చేసేదొకటి అన్నట్లుగానే ఆయన వ్యవహార శైలి ఉంటోంది. ఇప్పుడు తాజాగా ఆయన వాలంటీర్ల ప్రొబేషన్ విషయంలో మళ్లీ మాట తప్పి మడమ తిప్పారు. వాలంటీర్ వ్యవస్థ తన మానస పుత్రికగా గొప్పగా చెప్పుకునే జగన్ వారికి ప్రొబేషన్ ఇచ్చే విషయంలో ముందు వెనుకలాడుతున్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల విషయంలో జగన్ సర్కార్ వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది. వారి జీవితాలను చిందర వందర చేసేదిగా ఉంది. ప్రొబేషన్ ఇవ్వడానికి అనధికారికంగా పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షలో అర్హత సాధించిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని పేర్కొని..అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందరికీ ప్రొబేషన్ స్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు. అయితే నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా జూన్ నుంచి అందరికీ ప్రొబేషన్ ఇస్తామని అన్నారు. వాలంటీర్లు నమ్మారు. అయితే ఇప్పుడు ప్రొబేషన్ కు అర్హులు ఎవరో చెప్పాలంటూ జిల్లా యంత్రాంగాలకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అంటే గతలో అనధికారికంగా నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణతే అర్హతగా వాలంటీర్లకు ప్రొబేషన్ ఇస్తారన్న మాట. అంటే వాలంటీర్లందరికీ ప్రోబేషన్ ఇస్తామన్న మాటను జగన్ తప్పారు. ఇచ్చిన హామీ విషయంలో మడమ తిప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పరీక్షలు రాసే ఉద్యోగంలోకి వచ్చారు. వారి సర్వీస్ రికార్డులో కానీ..జాయినింగ్ రిపోర్టులో కానీ రెండేళ్ల తర్వాత మరోసారి పరీక్షలు పెడతాం… అందులో పాసయితేనే ప్రొబేషన్ ఇస్తామనే షరతు ఎక్కడా పెట్టలేదు. పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉద్యోగంలో చేరే సమయంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించారనే ప్రభుత్వం చెప్పింది. అదే విధంగా అప్పాయింట్ మెంట్ కూడా ఇచ్చింది. కానీ రెండేళ్లు గడిచాయో లేదో.. వారికి ఉద్యోగ భద్రత లేదన్న విషయాన్ని తేటతెల్లం చేసింది. పరీక్షల మీద పరీక్షలు పెట్టి ఫెయిలయ్యారంటూ వాలంటీర్లలో కనీసం ముఫ్పై శాతం మందిని వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నది. ప్రభుత్వాన్ని నమ్మి మంచి భవిష్యత్ను వదులుకుని సొంత ఊరిగా ఉద్యోగం అన్న ఆశతో గ్రామ, వార్డు సచివాలయాల్లో కేవలం పదిహేను వేలరూపాయల జీతానికి పని చేస్తున్న వాలంటీర్లను నిలువునా ముంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది.
http://www.teluguone.com/news/content/jagan-decieve-valunteers-25-135737.html





