జగన్ బల నిరూపణకి కాంగ్రెస్ ప్రోత్సాహం ఉందా?
Publish Date:Oct 28, 2013
Advertisement
ఇటీవల వైకాపా హైదరాబాదులో సమైక్య శంఖారావం సభ రాష్ట్రాన్ని సమైక్యంగా నిలిపేందుకేనని ఆ పార్టీ నేతలు చెపుతుంటే, మరో పక్క కాంగ్రెస్ సీనియర్ నేత నేత జేసీ దివాకర్ రెడ్డి జగన్ సభకు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మద్దతు ఉందని ప్రకటించి స్వంత పార్టీ నేతలనే కాక వైకాపాని కూడా ఆత్మరక్షణలో పడేసారు. అందుకు వెంటనే స్పందించిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆయనకి తీవ్రంగా హెచ్చరించిన సంగతి ఇప్పటికే వార్తలకెక్కింది. అయితే రాష్ట్ర విభజన చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఇటువంటి కీలక తరుణంలో జగన్ నిర్వహిస్తున్న సమైక్య సభకు ఎందుకు ప్రోత్సహిస్తుందనే అనుమానాలు ఎవరికయినా కలగడం సహజం. దానికి కూడా దివాకర్ రెడ్డి వ్యాఖ్యలలోనే సమాధానం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం తమపై నమ్మకం లేకనే తమనందరినీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకువచ్చిందని ఆయన ఆరోపించారు. లగడపాటి, హర్ష కుమార్ తదితర సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఇదేవిధంగా మాట్లాడారు. అందుకే దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో తన సోదరుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గాక స్వతంత్ర అభ్యర్ధిగాగా పోటీ చేయక తప్పని పరిస్థితి ఉండవచ్చని అన్నారు. ఈవిధంగా సీమంద్రాకు చెందిన కాంగ్రెస్ నేతలు అందరూ తమ టికెట్స్ పై, విజయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కారణంగా, జగన్ పై పూర్తి నమ్మకం పెట్టుకొన్న కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు ముందు జగన్మోహన్ రెడ్డికి నేటికీ ప్రజాదరణ ఉందా లేదా? అనే అని నిరూపించుకోనేందుకే అతని సభకు సహకరించిందని దివాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను బట్టి అర్ధం అవుతోంది. అయితే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఒకరొకరుగా జగన్మోహన్ రెడ్డికి తమ పార్టీ అధిష్టానానికి మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ప్రకటిస్తుంటే, తెలంగాణా కాంగ్రెస్ నేతలు మాత్రం అటువంటిదేమీ లేదని ఖండిస్తుండటం విశేషం. సోనియాగాంధీ మీద ఈగ వాలినా ఒంటి కాలు మీద లేచే కాంగ్రెస్ నేతలందరూ మొన్నసమైక్య సభలో జగన్మోహన్ రెడ్డి ఆమెను అంతగా దూషించినప్పటికీ ఎవరూ పెద్దగా నోరు మెదపకపోవడం గమనార్హం. అదేవిధంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగుని ఈ రోజు డిల్లీలో మీడియావాళ్ళు జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ అనుబంధం గురించి ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం దాటవేయడం కూడా విశేషమే. నరేంద్ర మోడీ రాహుల్ లేదా సోనియా గాంధీల గురించి గాని పల్లెత్తు మాట అంటే అందరి కంటే ముందుగా ఆయనపై విరుచుకుపడే దిగ్విజయ్ సింగ్ కూడా జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అనకపోవడం గమనార్హం. దీని మతలబేమి కాంగ్రెస్ నేతలారా?
http://www.teluguone.com/news/content/jagan-37-26945.html