హవ్వ.. వైసీపీ శాసనసభాపక్ష సమావేశమా?
Publish Date:Aug 11, 2026
Advertisement
రాజకీయ పార్టీలలో వైసీపీ స్టైలే వేరు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన ఒక్కటంటే ఒక్క లక్షణం కూడా ఆ పార్టీకి లేదని గతంలో పలుమార్లు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు విమర్శలు గుప్పించారు కూడా. అయితే వైసీపీ వ్యవహరించే తీరు చంద్రబాబు విమర్శలకు బలం చేకూర్చేదిగానే ఉంటోంది. తాజాగా ఆ పార్టీ బుధవారం (ఆగస్టు 12) శాసన సభా పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. దీనిపై.. రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తం అవుతున్నది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. అటువంటి పార్టీ, అసెంబ్లీలో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన తీరు, సభలో జరిగే చర్చలకు ఎలా స్పందించాలి అనే విషయాలపై చర్చించేందుకు శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేయడమేంటా అన్న విస్మయం ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్లోనే కాదు.. సొంత పార్టీ నాయకులలోనూ.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్యేలలోనూ కూడా వ్యక్తమౌతోంది. ఈ నెలలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సెషన్ లో పార్టీ అనుసరించాల్సి వ్యూహం ఏమిటన్నదానిపై చర్చిస్తారా? లేక సభకు హాజరు కావాలా వద్దా? అన్న విషయంపై చర్చిస్తారా అన్నవిషయం ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సభలో వైసీపీ ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టింది. అయితే ప్రతిపక్ష హోదాకు అవసరమైనంత మంది సభ్యులు ఆ పార్టీ తరఫునుంచి గత ఎన్నికలలో విజయం సాధించలేకపోవడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. జగన్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా రాలేదు. దీంతో.. శాసనసభలో తమకు మాట్లాడే అవకాశం ఉండదని పేర్కొంటూ.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో అడుగుపెడతానంటూ జగన్ శపథం చేసి.. అసెంబ్లీకి గైర్హాజరవుతున్నారు. ఆయనతో పాటు వైసీపీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు కూడా అసెంబ్లీకి ముఖం చాటేశారు. అంత వరకూ బానే ఉన్నా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలలో అంతర్మథనం ఆరంభమైందని పరిశీలకులు అంటున్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తరువాత వరుసగా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైతే ఎదురయ్యే చట్టపరమైన సమస్యలను ఎలా ఎదుర్కోవాలన్న భయం వారిలో బలంగా వ్యక్తమౌతోంది. శాసనసభ నిబంధనల ప్రకారం సుదీర్ఘకాలం సభకు గైర్హాజరైతే . అనర్హత వేటు పడుతుందన్న ఆందోళనతో.. ఈ సారి సమావేశాలకు హాజరు కావాలని ఉన్న పదకొండు మంది సభ్యులలో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. వారి ఒత్తిడి కారణంగానే జగన్ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కనీసం ఒకరోజో, రెండు రోజులో సభకు హాజరై.. అటెండెన్స్ వేయించుకుంటే.. అనర్హత వేటు గండం నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతోనే, ఆ విషయంపై చర్చించేందుకు శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉంటారని అంటున్నారు. మొత్తానికి ఏపీ అసెంబ్లీ సమావేశాల సమయంలో జగన్ ఏర్పాటు చేసిన ఈ వైసీపీ శాసనసభాపక్ష సమావేశం ఇప్పుడు రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. జగన్ సహా ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి హాజరైనా వారికే నష్టం, గైర్హాజరైనా వారికే నష్టం అన్నట్లుగా పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సభకు హాజరైతే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వైదొలగినట్లౌతుందనీ, హాజరు కాకుండా అనర్హత వేటు ప్రమాదం పొంచి ఉందనీ అంటున్నారు. Jagan, AP Assembly sessions, YCP strategy, YCPLP Meeting, Andhra Pradesh News, TeluguOne
http://www.teluguone.com/news/content/jagan-25-228676.html




