దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ ఎప్పుడంటే..!
Publish Date:Jun 5, 2021
Advertisement
దేశాన్ని అతలాకతులం చేసిన కొవిడ్ సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పట్టింది. నెల రోజుల క్రితం రోజూ నాలుగు లక్షలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం లక్షా 20 వేలకు తగ్గింది. రెండు నెలల కనిష్టానికి దేశంలో కొత్త కేసులు , యాక్టివ్ కేసులు చేరుకున్నాయి. జూన్ చివరికి సెకండ్ వేవ్ పూర్తిగా కట్టడిలోకి వస్తుందని కేంద్ర వైద్యశాఖ అంచనా వేస్తోంది. అయితే సెకండ్ వేవ్ తగ్గుతున్నా.. త్వరలోనే థర్డ్ వేవ్ వస్తుందనే హెచ్చరికలకు వస్తున్నాయి. భారత్ లో థర్డ్ వేవ్ రావడం ఖాయమని కేంద్ర సంస్థ కూడా చెబుతోంది. అయితే అది ఎప్పుడు వస్తుందన్నది స్పష్టత లేదు. దేశానికి థర్డ్ వేవ్ ముప్పుకు సంబంధించి నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో థర్డ్ వేవ్ రావడం ఖాయమన్నది వైద్య నిపుణుల అభిప్రాయంగా చెప్పారు. సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశముందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అప్పటిలోగా వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సిన అవసరముందన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియతో మాత్రమే థర్డ్ వేవ్తో పాటు తదుపరి వేవ్లను కట్టడి చేయగలమని వారు సూచిస్తున్నారు. సెకండ్ వేవ్ను కట్టడి చేయడంలో దేశం విజయం సాధించిందని…అందుకే దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు వీకే సారస్వత్ చెప్పారు. మన శాస్త్ర సాంకేతికత, ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు, ఆక్సిజన్ సరఫరా కోసం రైల్వే సేవల వినియోగం, విమానాశ్రయాల వినియోగం, ఆర్మీ సేవల వినియోగం తదితర చర్యలు మంచి ఫలితాలు ఇచ్చినట్లు విశ్లేషించారు. సెకండ్ వేవ్కు ముందు తొలి వేవ్ను కూడా దేశం సమర్థవంతంగా కట్టడి చేయగలిగినట్లు వీకే సారస్వత్ చెప్పారు. ఎమర్జెన్సీ మెడికల్ మ్యానేజ్మెంట్లో దేశం పనితీరు సంతృప్తికరంగా ఉందని వ్యాఖ్యానించారు. థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు దేశం సన్నద్ధంకావాల్సిన అవసరముందన్నారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్.
http://www.teluguone.com/news/content/india-will-face-covid-third-wave-soon-25-116951.html