దేశంలో వైమానిక ప్రమాదంలో చనిపోయిన ప్రముఖులు వీళ్లే...
Publish Date:Dec 8, 2021
Advertisement
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దుర్మరణం చెందారు. బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ Mi-17 V5 కూనురు సమీపంలో క్రాష్ అయింది. వెల్లింగ్టన్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ క్రాష్ కావడంతో సీడీఎస్ బిపిన్ రావత్ సహా.. అందులో ప్రయాణిస్తున్న మొత్తం 14 మంది చనిపోయారు. బిపిన్ రావత్ ప్రయాణించిన Mi-17 V5హెలికాప్టర్ భారత వైమానిక దళానికి చెందినది. ఇది రష్యాలో తయారైంది. వీటిని ప్రధానంగా సైనిక రవాణా కోసం వినియోగిస్తారు. Mi-17 V5 హెలికాప్టర్కు రెండు ఇంజన్లు ఉంటాయి. ప్రపంచంలోని అధునాతన రవాణా హెలికాప్టర్లలో ఇది ఒకటి. అందుకే సైనిక దళాలను, ఆయుధాలను మోసుకెళ్లడంతోపాటు, అగ్నిమాపక సిబ్బంది తరలింపు, పెట్రోలింగ్, సెర్చ్ ఆపరేషన్స్, రెస్క్యూ కార్యకలాపాల కోసం దీన్ని ఉపయోగిస్తుంటారు.సముద్రాలు, ఎడారి ప్రాంతాలలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా ఈ హెలికాప్టర్ను రూపొందించారు.భారత వైమానిక దళం దీనిని వీఐపీ చాపర్గా ఉపయోగిస్తుండగా, భారత ప్రభుత్వం వీవీఐపీ చాపర్గా వినియోగిస్తుంటుంది. ఎయిర్ స్ట్రిప్ లేని ప్రదేశాలకు ఈ హెలికాప్టర్లో వీవీఐపీలను తీసుకెళ్తూ ఉంటారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఈ హెలికాప్టర్ ద్వారా లద్ధాఖ్, కేదార్నాథ్ వంటి ప్రాంతాలకు వెళ్లారు. రక్షణ మంత్రి వంటి వీవీఐపీలు ఈ హెలికాప్టర్లో మారుమూల ప్రాంతాలకు వెళుతుంటారు.అయితే కొన్నేళ్లుగా ఈ హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. భారతదేశంలో జరిగిన విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. సంజయ్ గాంధీ: హెలికాప్టర్ ప్రమాదంలో జూన్ 23, 1980న సంజయ్ గాంధీ చనిపోయారు. సంజయ్ గాంధీ నడుపుతున్న విమానం ఢిల్లీలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు.ఈ ప్రమాదం అత్యంత వివాదాస్పదం కావడంతోపాటు, చర్చనీయాంశంగా కూడా మారింది. మాధవరావు సింధియా: సెప్టెంబరు 2001న ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పురి జిల్లా భోగావ్ తహసీల్ సమీపంలో మోటా వద్ద జరిగిన విమాన ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు మాధవరావు సింధియా మరణించారు. ఒక సభలో పాల్గొనేందుకు జిందాల్ గ్రూప్కు చెందిన 10 సీట్ల చార్టర్డ్ విమానంలో కాన్పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలిపోవడంతో అందులో ఉన్న ఆరుగురు చనిపోయారు. జీఎంసీ బాలయోగి: 2002 మార్చి3న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో బెల్ 206 హెలికాప్టర్ కూలిపోవడంతో లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి మరణించారు.బెల్ 206 అనేది ఒక ప్రైవేట్ హెలికాప్టర్. అందులో బాలయోగి, ఆయన సెక్యురిటీ గార్డ్, ఒక సహాయకుడు ఉన్నారు. హెలికాప్టర్ కూలిపోవడానికి సాంకేతిక లోపమే కారణమని గుర్తించారు. ఓపీ జిందాల్ : 2005 ఏప్రిల్ లో సుప్రసిద్ధ ఉక్కు వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు ఓపీ జిందాల్ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో హరియాణా మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కుమారుడు సురీందర్ సింగ్, పైలట్ కూడా మరణించారు. చండీగఢ్ నుంచి ఢిల్లీకి వస్తుండగా ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. మరణించేనాటికి ఓపీ జిందాల్ హరియాణ విద్యుత్ శాఖమంత్రిగా పని చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి : 2009 సెప్టెంబర్ 2 హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణించారు. 2009 సెప్టెంబర్లో నల్లమల అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఆయన హెలికాప్టర్ కూలిపోయింది.ఈ ప్రమాదంలో ఆయనతోపాటు మరో నలుగురు మరణించారు. మొదట హెలికాప్టర్ కనిపించకుండా పోయిందని ప్రకటించారు. తర్వాత కూలిపోయినట్లు నిర్ధారించారు.సైన్యం సహాయంతో అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. కర్నూలుకు 74 కిలోమీటర్ల దూరంలోని రుద్రకొండ కొండపై హెలికాప్టర్ శకలాలు లభ్యమయ్యాయి. దోర్జీ ఖండూ: ఏప్రిల్ 2011లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ మరణించారు. ఖండూ నాలుగు సీట్ల సింగిల్ ఇంజన్ పవన్ హన్స్ హెలికాప్టర్ AS-B350-B3లో ప్రయాణించారు. తవాంగ్ నుంచి బయలుదేరిన 20 నిమిషాలకే ఆయన హెలికాప్టర్ అదృశ్యమైంది. నాలుగు రోజుల పాటు హెలికాప్టర్ ఆచూకీ దొరకలేదు. అయిదవ రోజున సెర్చ్ టీమ్లు హెలికాప్టర్ శకలాలు, అయిదుగురి మృతదేహాలను కనుగొన్నాయి.
http://www.teluguone.com/news/content/india-lost-key-persons-in-helicopter-crash-incidnets-39-127984.html