సలాల్ డ్యామ్, బాగ్లిహార్ ప్రాజెక్టుల పూడిక తీత.. పాక్ కు చుక్కలే.!
Publish Date:Jul 18, 2026
Advertisement
భారత్, పాకిస్తాన్ మధ్య జల వనరుల పంపిణీకి సంబంధించిన వివాదాలు మరోసారి ముదిరిపాకాన పడ్డాయి. జమ్మూ కశ్మీర్ పరిధిలోని కీలకమైన రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులలో భారీ ఎత్తున పూడికతీత ( పనులను చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. చినాబ్ నదిపై నిర్మించిన సలాల్, బాగ్లిహార్ డ్యామ్లలో పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఉగ్రవాద చర్యలను అణచివేయని పక్షంలో చర్చలు ఉండబోవని ఇప్పటికే స్పష్టం చేసిన భారత్.. ఇప్పుడు ఏకపక్షంగా తన సొంత భూభాగంలోని డ్యామ్ల పునరుద్ధరణపై దృష్టి సారించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 16న మొదలైన పూడిక తీత పనులు ఈ నెల 26 వరకు సాగనున్నాయి. రియాసి జిల్లా పరిధిలోకి వచ్చే సలాల్ డ్యామ్, అలాగే రాంబన్ జిల్లాలో ఉన్న బాగ్లిహార్ ప్రాజెక్టులు విద్యుదుత్పత్తిపరంగా కీలకమైనవి. అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఈ జలాశయాలలో టన్నుల కొద్దీ పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గింది. . ఇది విద్యుత్ ఉత్పాదనపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి పూడికతీత పనులు చేపట్టింది. 1970 నుండి ఈ డ్యామ్లలో ఎప్పుడూ సరైన రీతిలో పూడికతీత పనులు జరగలేదు. గతంలో భారత్ ఇటువంటి ప్రయత్నాలు చేయాలని భావించిన ప్రతిసారీ పాకిస్తాన్ అంతర్జాతీయ నియమాలను అడ్డం పెట్టుకుని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గతంలో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో దౌత్యపరమైన ఒడంబడికల కారణంగా స్లూయిస్ గేట్లను మూసివేయాల్సి వచ్చింది. అప్పట్లో విదేశాంగ మంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ.. పాక్ ఒత్తిడికి తలొగ్గి డ్యామ్ ఎత్తును 10 మీటర్ల మేర తగ్గించారు. దీనివల్ల భారత్ నష్టపోగా, పాకిస్తాన్ లబ్ధి పొందుతూ వచ్చింది. ప్రస్తుతం 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా పక్కన పెట్టడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆరున్నర దశాబ్దాల క్రితం క్రితం కుదిరిన ఈ ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, ఆధునీకరించాలని న్యూఢిల్లీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఒప్పందంలో మార్పులు జరిగే వరకు పాకిస్తాన్కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఇండియా.. తన సార్వభౌమత్వ పరిధిలోని పనులను వేగవంతం చేసింది. చినాబ్ నీటిపై పాకిస్తాన్కు హక్కులు ఉన్నప్పటికీ, తన అంతర్గత పరిధిలో మౌలిక వసతుల నిర్వహణ చేసుకునే హక్కు భారత్కు ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. దీంతో భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్ వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై కోలుకోలేని దెబ్బ తీసేలా కనిపిస్తోంది. డ్యామ్ల నుండి తొలగించే బురద, వ్యర్థాలు నదీ ప్రవాహం ద్వారా దాదాపు 50 కిలోమీటర్ల మేర ప్రయాణించి పాక్ భూభాగంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల అక్కడ ఉన్న ప్రధాన కాలువలు, హెడ్వర్క్స్ వ్యవస్థలు పూడికతో నిండిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే సమయంలో ఎగువన భారీ వర్షాలు కురిస్తే పాక్లో వరద ముప్పుతో పాటు మౌలిక వసతులు ధ్వంసమవుతాయి. మరోవైపు, పూడికతీత ప్రక్రియ పూర్తయిన తర్వాత సలాల్, బాగ్లిహార్ ప్రాజెక్టులలో నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం భారీగా పెరుగుతుంది. దీనివల్ల దిగువన ఉన్న పాకిస్తాన్కు సహజంగానే విడుదలయ్యే నీటి పరిమాణం తగ్గుముఖం పడుతుంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతతో, నీటి సమస్యతో సతమతమౌతున్న పాకిస్థాన్కు ఇది కోలుకోలేని దెబ్బగా మారుతుంది. Indus Waters Treaty, Salal Dam Desilting, Baglihar Project Chenab River, India Pakistan Water Dispute,
http://www.teluguone.com/news/content/india-desilting-operations-at-the-salal-dam-and-baglihar-projects-36-226351.html





