స్వాతంత్రం ఫలాలు కొందరికేనా
Publish Date:Aug 15, 2013
Advertisement
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నేటికి 67సం.లు. ఈ సుదీర్ఘ కాలంలో భారత్ పరిస్థితి మూడడుగులు ముందుకు రెండుడడుగులు వెనక్కి అన్నరీతిలో ముందుకు సాగుతోంది. ఇందుకు ప్రధానకారణం స్వార్ధ పరులు, అసమర్ధులు, అవినీతిపరులయిన నేతలే. అటువంటి నేతలను ఎన్నుకొన్న ప్రజలను కూడా నిందించక తప్పదు. ప్రజలు రాజకీయంగా ఎంతో చైతన్యవంతులు, విద్యావంతులయినప్పటికీ కుల,మత,ప్రాంత, బాష వంటి అంశాల వల్ల తీవ్ర ప్రభావితులయిన కారణంగా, సదరు నేత ఎంత అవినీతిపరుడు, అసమర్ధుడని తెలిసినప్పటికీ, తమకులం వాడో, మతం వాడో అయితే అతని అవినీతిని, అసమర్ధతను పట్టించుకోకూడదనే ఒక మూర్ఖ సిద్ధాంతానికి ప్రజలు కూడా లొంగిపోవడమేకాకుండా, సదరు నేతలను విమర్శించిన వారిని ఎదుర్కోవడం తమ నైతిక బాధ్యతగా భావించడం వలననే అటువంటి నేతల ఆటలు ఇంకా సాగుతున్నాయి. శాస్త్ర సాంకేతిక,విద్యా, వైద్య, వ్యాపార రంగాలలో దేశం చాలా అభివృద్ధి సాధించినప్పటికీ, 67సం.ల వ్యవధిలోఇంతకు పదింతలు జరిగి ఉండాల్సి ఉండగా, నేటికీ దేశంలో జరుగవలసినంతగా అభివృద్ధి జరుగలేదనేది చేదు నిజం. జరిగిన గోరంత అభివృద్ధిని భూతద్దంలో కొండంతగా చేసి చూపిస్తూ మన దేశం త్వరలో అమెరికాను మించిపోనున్నదని రాజకీయనాయకులు చెపుతూ ప్రజలని భ్రమలో బ్రతికేలా చేస్తున్నారు. ప్రజలందరి చేతుల్లో సెల్ ఫోనులుండటం, ఏడాదికి ఒకట్రొండు శాటిలయిట్లు పైకి ఎగురవేయడమే గొప్ప అభివృద్ధి అనే వితండ వాదనచేస్తున్నారు, అయితే ఎప్పుడో 50సం.లక్రితం రష్యా వాడి పక్కన పడేసిన తుప్పు పట్టిన మిగ్ విమానాలను, సబ్మెరయిన్లను ఎందుకు అద్దెకు తెచ్చుకొనే, కొనుకోవలసి వస్తోందనే ప్రశ్నకు సరయిన సమాధానం చెప్పలేరు. దేశంలో అంబానీ వంటివారు మరింత ధనవంతులవడమే అభివృద్ధి అనుకొంటే, దేశంలో లక్షలాది గ్రామాలలో ప్రజలు నేటికీ కూటికి గుడ్డకి నోచుకోని స్థితిలో విలవిలలాడటాన్ని ఏవిధమయిన అభివృద్ధి అనాలో మన పాలకులే చెప్పాలి. పట్టణాలలో ప్రజల ఆర్ధికస్థితి కొంతమేర మెరుగుపడిన విషయం వాస్తవమే. కానీ, నానాటికి పెరిగిపోతున్నధరల ప్రభావం వలన వారి పరిస్థితి కూడా మళ్ళీ మొదటికే వస్తోంది. ప్రజలకి ఉపాధి మార్గాలు కల్పించి వారు ఆర్ధిక స్వావలంభన పొందేవిధంగా ఆలోచన చేయవలసిన ప్రభుత్వాలు రోజుకో కొత్త ప్రజాకర్షకపధకం ప్రకటిస్తూ ప్రజలు శాశ్వితంగా ప్రభుత్వంపైనే ఆధారపడేలా చేయడం ప్రజల దౌర్భాగ్యమనే చెప్పాలి. అధికార కేంద్రీకరణకు అలవాటుపడిన మన రాజకీయ వ్యవస్థలు అభివృద్ధిని కూడా నగరాలకు మాత్రమే పరిమితం చేస్తూపోవడం వలన, ఆర్ధిక అసమానతలు కూడా అదే నిష్పత్తిలో పెరుతున్నాయి. తత్ఫలితమే దేశంలో ఈ దుస్థితి. ఇదంతా నిరాశావాదంగా అనిపించవచ్చును. కానీ, ఇది దేశంలో నెలకొన్నప్రస్తుత అరాచక పరిస్థితుల పట్ల ఒక సగటు పౌరుడి ఆందోళన మాత్రమే.
http://www.teluguone.com/news/content/independence-day-37-25161.html