ఒకే రోజు 840 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా రక్షణ..!
Publish Date:Jul 19, 2026
Advertisement
హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో శనివారం హైడ్రా భారీ స్థాయిలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో మొత్తం 840 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడింది. సుమారు రూ.30 వేల కోట్లకు పైగా విలువ చేసే ఈ భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది. భారీ పోలీసు బందోబస్తుతో రెవెన్యూ అధికారుల సమక్షంలో నిర్వహించిన ఈ చర్యలతో ప్రభుత్వ భూములను నకిలీ పత్రాలు, తప్పుడు సర్వే నంబర్ల ఆధారంగా కాజేయాలని ప్రయత్నిస్తున్న వారికి హైడ్రా గట్టి హెచ్చరిక పంపింది. ఈ ఆపరేషన్లో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలోని సర్వే నంబర్లు 25, 26లో ఉన్న 650 ఎకరాల ప్రభుత్వ భూమి, శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం లోని సర్వే నంబర్ 46లో ఉన్న 84 ఎకరాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని జీఎల్ఆర్ నంబర్లు 243, 255లో ఉన్న 106 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. రాయదుర్గంలో ఎకరాల కొద్దీ ఆక్రమణలకు అడ్డుకట్ట ఐటీ కారిడార్లో టి-హబ్కు సమీపంలో ఉన్న రాయదుర్గంలోని మల్కం చెరువు ఎదురుగా ఉన్న కొండలు, పచ్చని చెట్లతో కూడిన ప్రభుత్వ భూమిపై కొందరు రియల్ ఎస్టేట్ సంస్థలు కన్నేశాయి. ప్రైవేట్ పట్టాకు చెందిన అర ఎకరం భూమిని కొనుగోలు చేసిన తర్వాత, పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా తక్కువ ధరకే కొనుగోలు చేసినట్లు చూపిస్తూ సర్వే నంబర్ 46లోని ప్రభుత్వ భూమి లోకి చొరబడి దాదాపు ఎకరం వరకు ఆక్రమిం చినట్లు అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్లు కూడా జరిగినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరం భూమి ధర రూ.200 కోట్ల వరకు పలుకుతుండటంతో భారీ స్థాయిలో ఆక్రమణలకు ప్రయత్నాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 84 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా పూర్తిస్థాయి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టింది. కంటోన్మెంట్లో 106 ఎకరాల భూమి రక్షణ...! సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని జీఎల్ఆర్ నంబర్లు 243, 255లో ఉన్న 106 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించేందుకు కొందరు నిర్మాణ సంస్థలు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. వేరే సర్వే నంబర్ల పేరుతో లేఔట్లు వేసి ప్లాట్లుగా విక్రయించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడైంది. కొండలను పేల్చడం, చెట్లను తొలగించడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు నెమళ్లు వంటి వన్యప్రాణులు నివాస ప్రాంతాల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా అధికారులు ప్రీకాస్ట్ గోడలను తొలగించి మొత్తం 106 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ చర్యను స్వాగతిస్తూ స్థానికులు ర్యాలీలు నిర్వహించి, టపాసులు పేల్చి హైడ్రాకు మద్దతు ప్రకటించారు. శంషాబాద్లో 650 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం...! రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దక్షిణ భాగంలో, ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న 650 ఎకరాల ప్రభుత్వ భూమిపై కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి ప్రభుత్వ భూములను కూడా తమవిగా చూపించే ప్రయత్నాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 1954 ఖాస్రా పహాణీ ప్రకారం సర్వే నంబర్లు 25, 26లోని 650 ఎకరాలు ప్రభుత్వ భూములేనని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 2002 నుంచి 2006 మధ్య నిర్వహించిన ఎంజాయ్మెంట్ సర్వేలో కూడా ఇదే విషయం తేలగా, ఆక్రమణలను క్రమబద్ధీకరించాలన్న ప్రతిపాదనను 2006లో సీసీఎల్ఏ తిరస్కరించింది. అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో ఈ భూములను కేటాయించరాదని ప్రభుత్వం అప్పుడే నిర్ణయించింది. అయినప్పటికీ కొందరు రైతులు, ఫామ్హౌస్ యజమానులు ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేస్తూ కొనసాగుతున్నట్లు గుర్తించిన అధికారులు వారిని ఖాళీ చేయించి మొత్తం 650 ఎకరాల భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఆక్రమణలపై హైడ్రా కఠిన చర్యలు...! ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రా ఇకపై కూడా ఇలాంటి ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. నకిలీ పత్రాలు, తప్పుడు సర్వే నంబర్లతో ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు చేసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకుని, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/hydra-big-operation-36-226461.html





