దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్..!
Publish Date:Jul 26, 2026
Advertisement
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. వర్షాల తీవ్రత తగ్గే సూచనలు కనిపించడం లేదు. భారత వాతావరణ శాఖ (IMD) జూలై 26న గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ఏ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..? ఐఎండీ అంచనా ప్రకారం మహారాష్ట్ర, ఒడిశాలో శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాత్, ఛత్తీస్గఢ్, కొంకణ్-గోవా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే గుజరాత్లో వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పాటన్ జిల్లాలోని సంతలూర్ ప్రాంతంలో గత 24 గంటల్లో 390 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని రాధన్పూర్, డియోడార్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని రాష్ట్రాల్లోనూ వర్షాలు.. జూలై 26న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం-మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గంగా నది పరివాహక పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అండమాన్-నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, గంగా నది పరివాహక పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాలకు కారణమేంటి..? ప్రస్తుతం నైరుతి రాజస్థాన్పై అల్పపీడన ప్రాంతం కొనసాగుతుండగా, వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో మరో అల్పపీడనం కేంద్రీకృతమైంది. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండు అల్పపీడన వ్యవస్థలను కలుపుతూ మధ్య భారతదేశం మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు ఉత్తర భారతదేశంపై చురుకుగా ఉన్న పశ్చిమ విక్షోభం ప్రభావంతో దేశవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలతో పాటు జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే నేల పూర్తిగా తడిసిపోవడంతో మరిన్ని భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు నీరు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో రేపు వర్షాలు.. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపిన వివరాల ప్రకారం.. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంపై అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో అదే ప్రాంతంలో కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై స్వల్పంగానే ఉంటుందని వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. Heavy rains across the country, APSDMA, IMD, Jharkhand, Odisha, Chhattisgarh, Heavy Rain Alert
http://www.teluguone.com/news/content/heavy-rains-across-the-country-36-227152.html





